కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులకు హాజరు కావడం చాలా కష్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగానే ఇంటర్నెట్ సరిగ్గా రాదు. దేశంలో కేవలం 15 శాతం వరకు గ్రామాల్లోనే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. దీంతో గ్రామాల్లో నివాసం ఉంటున్న విద్యార్థులకు ఇంటర్నెట్ను పొందడం కష్టంగా మారింది. ఈ క్రమంలో వారు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతున్నారు.
రాజస్థాన్లోని బార్మర్ జిల్లా దరురా అనే గ్రామంలో నివాసం ఉండే హరీష్ అనే బాలుడు జవహర్ నవోదయ విద్యాలయలో చదువుతున్నాడు. అయితే అతని గ్రామంలో సరైన ఇంటర్నెట్ సదుపాయం లేదు. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ పొందుదామంటే సిగ్నల్ సరిగ్గా రాదు. దీంతో అతను తమ గ్రామానికి సమీపంలో ఉండే ఓ కొండ పైకి ఎక్కి నిత్యం సాహసం చేస్తున్నాడు. నిత్యం ఉదయం 8 గంటలకు అతను కొండ ఎక్కి ఆన్లైన్ క్లాసులకు హాజరు అవుతున్నాడు. కొండపై మొబైల్ ఇంటర్నెట్ సిగ్నిల్ సరిగ్గా వస్తుంది. దీంతో అతను కొండపై కూర్చుని ఆన్లైన్ క్లాసులకు హాజరై.. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు కొండ దిగి ఇంటికి వెళ్తున్నాడు.
అయితే కేవలం హరీష్ మాత్రమే కాదు.. దేశంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ప్రస్తుతం సరిగ్గా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. కొందరు గ్రామాల సరిహద్దుల్లో ఉండే ఎత్తయిన ప్రాంతాలను చూసుకుంటుంటే.. కొందరు సాహసం చేస్తూ పొడవైన చెట్లు ఎక్కుతున్నారు. ఇదీ.. ప్రస్తుతం మన దేశంలో విద్యార్థుల పరిస్థితి. నిజంగా పాలకులు ఈ విషయం పట్ల సిగ్గు పడాలి. అస్తమానం రాజకీయాలు చేసే వారు ఇలాంటి సమస్యలపై ఎందుకు దృష్టి సారించరో అర్థం కావడం లేదు. ఏం చేస్తాం.. అంతా మన ఖర్మ కాకపోతే..!