రెండు బిల్లులు..చుట్టూ అనేక చిక్కులు.. బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపిన అసెంబ్లీ అధికారులు.. చట్టపరమైన..సాంకేతిక అంశాలను లేవనెత్తిన టీడీపీ..
రాష్ట్రంలో కొద్ది నెలలుగా వివాదాస్పదంగా మారిన మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. సిఆర్డీఏ, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు చేరుకు న్నాయి.
రెండు బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపిన అసెంబ్లీ అధికారులు దీని వెనుక చోటు చేసుకున్న పరిణామాలను నివేదిక రూపంలో సమర్పించారు. తొలి సారి అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్ ఆదేశించటం వివాదాస్పమైంది. ఆ తరువాత గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తిరిగి అవే బిల్లులను తొలుత అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదించుకుంది. మండలిలో ఎటువంటి నిర్ణయం లేకుండానే సమావేశాలు ముగిసాయి. శాసన మండలి లో రెండోసారి పెట్టి నెల రోజులు గడిచినందున బిల్లు ఆమోదం పొందినట్లుగానే భావిస్తూ ఇప్పుడు గవర్నర్ ఆమోదానికి పంపారు. ఇప్పుడు ఈ బిల్లులపైన గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. ఇందులో న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయని టీడీపీ గవర్నర్ కు లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టంతో ముడి పడి ఉన్న అంశం కావటంతో గవర్నర్ ఆమోదం తరువాత రాష్ట్రపతికి బిల్లులు పంపాలని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు అమరావతి భవిష్యత్ పైన కీలక నిర్ణయం గవర్నర్ తీసుకోవాల్సి ఉంది.
మండలిలో డీమ్డ్ టు బి యాక్సెప్ట్…
గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. దీని పైన వేసిన జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ నివేదికలు సైతం మూడు రాజధానులకు అనుకూలంగా ఉండటంతో జనవరిలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసారు. తొలుత కేబినెట్ లో మూడు రాజధానుల పైన కమిటీ నివేదికలను ఆమోదించి..శాసనసభలో బిల్లులు ప్రవేశ పెట్టా రు. అక్కడ ఆమోదం పొందాయి. ఆ తరువాత మండలిలో బిల్లులను ప్రతిపాదించిన సమయం నుండి అక్కడ సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న టీడీపీ అడ్డుకుంది. రెండు రోజుల వాగ్వాదాల తరువాత ఛైర్మన్ ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. కానీ, దీని పైన వివాదాలు చోటు చేసుకున్నాయి. తిరిగి గత నెలలో జరిగిన సమావేశాల్లో శాసనసభలో మరోసారి ఈ బిల్లులను ఆమోదించుకున్న ప్రభుత్వం తిరిగి మండలిలో ప్రవేశ పెట్టింది. అక్కడ ఎటువంటి నిర్ణయం రాకుండా సభ నిరవధిక వాయిదా పడింది. అయితే, రోజుల తరువాత బిల్లు ఆమోదం పొందాల్సిదింగా భావించాలి. ఇదే కారణంతో ఇప్పుడు బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు. ఆయన ఆమోదిస్తే మూడు రాజధానులకు ఆమోద ముద్ర పడినట్లే.
న్యాయ..సాంకేతిక సమస్యలు అడ్డు…
రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లును పెట్టిన ప్రభుత్వం..శాసన మండలిలో పెట్టిన నెల రోజుల తరువాత ఆటోమేటిక్ గా ఆమోదించినట్టుగా పరిగణ లోకి తీసుకొని ఆమోదం కోసం గవర్నర్ వద్దకు బిల్లులను పంపారు. అయితే, ఇదే సమయంలో టీడీపీ కొన్ని అభ్యంతరాలతో ముందుగానే గవర్నర్ కు లేఖ రాసింది. తొలి సారి మండలిలో ప్రవేశ పెట్టిన బిల్లులను ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారని..ఆ విషయాన్ని ప్రభుత్వం కోర్టులో సైతం అంగీకరించిందని టీడీపీ గుర్తు చేస్తోంది. సెలెక్ట్ కమిటీ కోసం పెండింగ్ లో ఉన్న బిల్లులను తిరిగి మండలిలో ప్రవేశ పెట్టటం..ఇప్పుడు నెల రోజుల్లో ఆమోదం పొందిందని చెబుతూ గవర్నర్ వద్దకు పంపటం సరి కాదంటూ టీడీపీ నేత యనమల లేఖ ద్వారా గవర్నర్ కు వివరించారు. ఈ రెండు బిల్లులు న్యాయ స్థానాల్లో నిలబడవని..గవర్నర్ సైతం అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని యనమల కోరుతున్నారు. అదే విధంగా… రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో రాజధాని మార్పు… బహుళ రాజధానుల విషయంలో చట్ట పరంగా రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు గవర్నర్ కోర్టులో ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించిన బిల్లులను ఆమోదిస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది .గవర్నర్ సైతం దీని పైన న్యాయ పరంగా నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వచ్చే వారం రోజుల్లో ఈ బిల్లుల వ్యవహారంలో ఆమోదమా.. తిరస్కారమా అనే విషయం అదే విధంగా అమరావతి భవిత తేలిపోయే అవకాశం కనిపిస్తోంది.