నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం…హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే..జగన్ ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో ఒకటైన ఆంధ్రజ్యోతిలో ‘రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలొద్దు ! జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన సుప్రీం’ అంటూ కధనం రాయగా మరో ప్రధాన పత్రిక ఈనాడులో ‘ఇదేమి ఆర్డినెన్స్? ఎస్ఈసీ పదవీకాలం కుదింపుపై సుప్రీం కోర్టు ప్రశ్న, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వబోమని స్పష్టికరణ, రెండు వారాల తరువాత పూర్తి స్థాయి విచారణకు నిర్ణయం’ అంటూ ప్రచురించింది. ఇక జగన్ ప్రభుత్వ అనుకూల (ఆయన సొంత పత్రిక) పత్రిక సాక్షిలో నిమ్మగడ్డకు సుప్రీం నోటీసులు, ఏపి ప్రభుత్వ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం’ అంటూ ప్రచురించాయి. ఎవరి బాణీకి అనుకూలంగా వారు వార్తలను ఇచ్చారు. వాటిలో తప్పేమి లేదు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఏపి హైకోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలనీ గానీ నిమ్మగడ్డకు అనుకూలంగా గానీ, ఏపి ప్రభుత్వానికి గానీ సుప్రీం ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే కొన్ని మీడియాలలో జగన్ సర్కారుకు ఎదురు దెబ్బ అంటూ హడావిడి చేశాయి. ఎస్ఈసీ విషయంలో ఏపి ప్రభుత్వ చర్యలు సరికాదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. రెండు వారాల తరువాత పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొన్నది.
ప్రభుత్వ కార్యాలయలకు పార్టీ రంగుల విషయంలో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ నాలుగు వారాలలో చర్యలు చేపట్టాలంటూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఆ మాదిరిగా ఈ విషయంలో హైకోర్టు తీర్పును పూర్తిగా సమర్దిస్తున్నట్లు గానీ, వ్యతిరేకిస్తున్నట్లు గానీ ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వలేదు.