భారీ వర్షాలు, వరదల బీభత్సానికి తెలంగాణ రాజధాని హైదరాబాదుతో పాటు పలు జిల్లాల్లో జన జీవనం స్తంభించడంతో పాటు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. హైదరాబాదు వందేళ్ల చరిత్రలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం, పెద్ద ఎత్తున వరద రావడం ఇది రెండవ సారి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సాయం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తక్షణం పది కోట్ల రూపాయల విరాళంగా ప్రకటించారు. తెలంగాణలో తుఫాను, వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం పళనిస్వామి సానుభూతి తెలియజేశారు. బాధితులను ఆదుకునేందుకు, సహాయ చర్యలకు తమ వంతుగా పది కోట్లు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తక్షణం పంపుతున్నట్లు తెలిపారు. అదే విధంగా వరద బాధితులకు బ్లాంకెట్స్, మాస్క్లు పంపుతున్నట్లు తెలిపారు పళనిస్వామి. తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా ఏటువంటి సహయం అవసరమైనా అందించడానికైనా తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమర్థవంతమైన పరిపాలనా చర్యలతో వరద ప్రభావిత ప్రాంతాలు త్వరగా కొలుకుని సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పళనిస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.