ఏపీలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికార వైసీపీ టిక్కెట్ల కేటాయింపులో దూసుకుపోతోంది. ఇప్పటికే ఐదు లిస్టుల్లో అభ్యర్థులను ప్రకటిస్తోంది. టీడీపీ – జనసేన కూటమి సైతం పైకి పేర్లు అధికారికంగా ప్రకటించకపోయినా రెండు పార్టీలు కలిసి ఏయే సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై ఓ అంచనాలకు, ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. లోక్సభ సీట్లకు వైసీపీ బీసీ స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది. మరీ ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో మెజార్టీ లోక్సభ సీట్లను బీసీ వర్గం నేతలకే ఇస్తోంది.
ఏలూరు లోక్సభ సీటును వైసీపీ బీసీల్లో బలమైన యదవ వర్గానికి చెందిన కారుమూరి సునీల్కుమార్కు కేటాయించింది. ప్రస్తుత తణుకు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుడే సునీల్. 2014లో కాపు, 2019లో వెలమ రెండుసార్లు ఓసీలకే ఈ సీటు ఇచ్చిన జగన్ ఈ సారి బీసీ అస్త్రంతో సునీల్ను దింపారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ అస్త్రానికి ధీటుగా అదే బీసీ అస్త్రం… అందులోనూ యాదవ వర్గం నేతలను బరిలోకి దింపడం ఖరారైంది.
బీసీల నుంచే యాదవ వర్గానికే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గోరుముచ్చు గోపాల్యాదవ్కు టీడీపీ ఏలూరు లోక్సభ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం కంఠమనేనివారిగూడెంకు చెందిన గోపాల్ ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి గత మూడు ఎన్నికల్లోనూ కమ్మ వర్గానికే చెందిన సీనియర్ నేత మాగంటి బాబు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లలో ఆయన 1.65 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
వైసీపీ ఏలూరు లోక్సభ సీటులో బీసీ అస్త్రం ప్రయోగిస్తుందని వార్తలు మొదలైనప్పటి నుంచే గోరుముచ్చును రంగంలోకి దించిన టీడీపీ అధిష్టానం ఆయన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. అటు కారుమూరి సునీల్ పేరు ఖరారు కావడంతో ఇక్కడ పసుపు జెండా ఎగరేయాలంటే వైసీపీ బీసీ అస్త్రాన్ని బీసీ కార్డుతోనే ఎదుర్కోవాలని… గోరుముచ్చు అయితే బీసీ కార్డుతో పాటు ఆర్థికంగా కూడా స్ట్రాంగ్గా ఉండడం ప్లస్ అవుతుందనే ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో యాదవ వర్గంతో పాటు బీసీల ఓట్లు 5 లక్షల పైనే ఉన్నాయి. పైగా ఇదే పార్లమెంటు పరిధిలోని నూజివీడు అసెంబ్లీ నుంచి కూడా టీడీపీ తరపున మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథి పోటీ చేయడం ఖాయమైంది. ఓకే పార్లమెంటు పరిధిలో పార్టీ నుంచి ఒక అసెంబ్లీ, లోక్సభ సీటు కూడా ఈ వర్గానికి ఇవ్వడంతో టీడీపీకి చాలా ప్లస్ కానుంది. ఇటు కారుమూరి సునీల్ పోటీలో ఉన్నా ఆయన తండ్రి నాగేశ్వరరావు పోటీ చేస్తోన్న తణుకు నరసాపురం పార్లమెంటులో ఉంది. ఇదో మైనస్ అనుకుంటే.. గోరుముచ్చు లోకల్ అయితే… కారుమూరి సునీల్ ఏలూరు పార్లమెంటుకు నాన్ లోకల్…ఈ పరిణామాలు ఎవరికి ఎలా ? అనుకూలంగా మారతాయో ? చూడాలి.