ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తునిలో రాజకీయ కాక కేక రేపుతోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీచేసి.. వైసీపీ వ్యతిరేక గాలిలో విజయం దక్కించుకుందామని యనమల రామకృష్ణు డు తమ్ముడు యనమల కృష్ణుడు ప్రయత్నించారు. అయితే.. ఆయనను కాదని ఈ సారి రామకృష్ణుడు తనకుమార్తె దివ్యకు టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో ఇప్పుడు కృష్ణుడు వర్సెస్ రామకృష్ణుడు రాజకీ యాలు సాగుతున్నాయి. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్న రీతిలో కృష్ణుడు రాజకీయం చేస్తున్నారు.
అయితే.. కనీసం తన కుమార్తెను అయినా గెలిపించుకుని వారసత్వాన్నినిలబెట్టుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రయత్నిస్తున్నారు. దీంతో తుని రాజకీయం హాట్ హాట్ గా మారింది. వాస్తవానికి 1983లో టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి 2004 వరకు కూడా యనమల రామకృష్ణుడు గెలుస్తూనే వచ్చారు. ఆయన హవాకు అడ్డు లేకుండా పోయింది. 2009లో ఇక్కడ మారిన రాజకీయం యనమల కుటుంబానికి వరుస పరాజయాలు అందిస్తూనే ఉంది. తునిలో యనమల కుటుంబం గెలిచి 20 ఏళ్లు అవుతోంది. అసలు యనమల కుటుంబ తీరు వల్లే తుని ఓటరు ఆ కుటుంబానికి ఎప్పుడో దూరమయ్యారన్నది వాస్తవం.
ఇక ఇప్పుడు తమ్ముడు ను పక్కన పెట్టేసి కుమార్తె దివ్య కు టిక్కెట్ ఇప్పించుకోవడంతో మహిళా కోటాలో
ఈ సారైనా విజయం దక్కించుకుందమనేది యనమల రామకృష్ణుడు ప్రయత్నం. అయితే.. ఈ సీటు నుంచి వరుసగా రెండు సార్లు పోటీ చేస్తూ వచ్చి.. ఓటమిని ఎదుర్కొన్న కృష్ణుడు.. ఈ దఫా కీలకమైన ఎన్నికల సమయంలో (అంటే.. జనసేన+టీడీపీ కలవడంతో తన గెలుపు ఖాయమని) తనకు టికెట్ లేకుండా పోవడంతో ఆయన తన సొంత అన్న యనమలపైనే ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ నేతలకు కూడా ఆయన టచ్లోకి వెళ్లిపోయారనే చర్చ సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణంగా సహకరించేందుకు మౌఖికంగా కృష్ణుడు అంగీకరించారనేది తుని వైసీపీ నేతల మాట. వైసీపీ అధికారంలోకి రాగానే.. కృష్ణుడుకి ఎమ్మెల్సీ సీటును ఇస్తామని.. సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ద్వారా సీఎం జగన్ నేరుగా కబురు చేశారనేది కూడా బహిరంగంగా వినిపిస్తు న్నమాట. దీంతో యనమల కుటుంబంలోనే టికెట్ చిచ్చు పెట్టినట్టయింది. అయితే.. బలమైన మాట తీరు, సీనియర్ల అండ ఉన్న యనమల రామకృష్ణుడు మాత్రం తన కుమార్తెను ఎట్టి పరిస్తితిలోనూ గెలిపించుకుని తీరుతానని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.