హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి దాదాపు రూ.3కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా చెన్నై (తమిళనాడు) కేంద్రంగా వివిధ రాష్ట్రాలకు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ లోని కస్టమర్ లకు నేరుగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు వీరు హైదరాబాద్ రాగా నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ తో కలిసి నార్త్ జోన్ పోలీసులు పట్టుకున్నారు.
ఈ ముఠాకు హైదరాబాద్ లో సబ్ ఏజంట్ ఎవరైనా ఉన్నారా..? డ్రగ్స్ వినియోగదారులకే అందజేయడానికి వచ్చారా..? ఈ డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేయనున్నారు..? తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులకు చిక్కిన నిందితులు గతంలో ఇదే రకమైన నేరాలకు పాల్పడుతూ దొరికిన పాత నేరస్తులని తెలుస్తొంది. ఈ సాయంత్రంలోపు పోలీసు అధికారులు.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తూ డ్రగ్స్ అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ డ్రగ్స్ కు అలవాటుపడిన వారు మాత్రం ఏదో రూపంగా తెప్పించుకునేందుకు అనేక దారులు వెతుకుతున్నారు. మరో పక్క కొత్త సంవత్సరం సందర్బంగా భారీ ఎత్తున పార్టీలు చేసుకునేందుకు కొందరు ప్లాన్స్ చేసుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘాను పటిష్టం చేసి తదనుగుమంగా చర్యలు చేపడుతున్నారు.