వైసీపీ నాయకుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం.. ఇంకా టీడీపీలో చేరలేదు. కానీ, ఆయన వస్తారని మాత్రం పార్టీకి సంకేతాలు అందాయి. దీంతో వెనువెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు గుమ్మనూరుకు టికెట్ ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి గుమ్మునురు పార్టీకి దూరమవుతున్నారన్న సమాచారం వైసీపీలో ఎప్పటి నుంచో ఉంది. వాస్తవానికి ఆయన గతంలో టీడీపీలోనే ఉన్నారు.
ఇప్పుడు సొంత గూడు తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, ఇప్పటికీ మంత్రి గుమ్మనూరు జయరాం కానీ.. ఆయన అనుచరులు కానీ ఎక్కడా నోరు విప్పలేదు. దీంతో పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తుందని చెబుతున్నారు. వైసీపీ విషయాన్ని తీసుకుంటే.. అనేక ఆరోపణలు వచ్చినా.. గుమ్మనూరును ఐదు ఏళ్లపాటు మంత్రిగానే కొనసాగించారు. అయితే.. ఈ దఫా ఆయనను కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే తన సీటు ఆలూరును తనకే ఇవ్వాలని.. తన ప్రత్యర్థికి ఇవ్వొద్దని పట్టుబట్టిన గుమ్మనూరు.. ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడలేదు. పైగా.. కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. మళ్ళీ ఆలూరు టికెట్ తనకే ఇవ్వాలని పట్టు పట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్వహించిన పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రాలేదు.
ఇక, అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నిర్వహించిన సిద్ధం 3వ బహిరంగ సభకు మంత్రి గుమ్మనూరు డుమ్మా కొట్టారు. దీంతో పార్టీకి ఆయన దూరమవుతున్నారని బలమైన నిర్నయానికి వచ్చిన వైసీపీ పోతేపోనీ.. అన్నట్టుగా వదిలేసింది. ఇక, ఆయన ఇంకా పార్టీలోకి రాకుండానే టీడీపీ అధినేత చంద్రబాబు.. జయరాంకు అనంతపూరం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం టికెట్ను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జయరాం రెండు రోజుల్లోనే టీడీపీ కండువా కప్పు కుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.