రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలాన్ని బట్టి.. నాయకులను బట్టి.. పార్టీల వ్యూహాలను బట్టి రాజకీ యాలు మారుతుంటాయి. దీనికి ఎవరూ అతీతులు కారు. పైగా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసితో ఉన్న నాయకులు చాలా మంది వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పార్టీలు కూడా నాయకులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా.. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ నాయకుడు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
ఎన్నారై టీడీపీ నాయకుడు.. పెమ్మసాని చంద్రశేఖర్ను గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్గా చంద్రబాబు నియమించారు. ఈ సమాచారం అందిన వెంటనే పెట్టే బేడా సర్దుకుని.. ఆయన అమెరికా నుంచి గుంటూరుకు వాలిపోయారు. ఆయన సొంత ప్రాంతం కూడా ఇక్కడే ఉంది. అదే బుర్రిపాలెం. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి.. పెద్దగా కొత్తకాదు. ఇక, టీడీపీలోనూ నాయకుల నుంచి సహకారం పెమ్మసానికి అందనుంది.
అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పెమ్మసాని తనకంటూ.. ప్రత్యేకంగా ఒక వ్యూహాన్ని రెడీ చేసుకుని ముందుకు సాగుతున్నారు. వైసీపీ గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కాపు నేతకు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా పోటీని తట్టుకునేందుకు పెమ్మ సాని కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే..ఈ క్రమంలో ఆయన మరో వ్యూహాన్ని రెడీ చేసుకున్నారు.
అదే.. ఉన్నత చదువులు పూర్తి, ఉద్యోగాలు లభించని మెరికల్లాంటి యువతను 20 మందిని నియమించు కుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరికి ధారాళంగా మాట్లాడడంపై తర్ఫీదు ఇవ్వనున్నారు. వీరిని గుంటూరు పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాలకు పంపించి.. అంటే.. ఏడు అసెంబ్లీ స్థానాల్లో నూ .. పంపించి.. విస్తృతంగా ప్రచారం చేయించనున్నారు. దీనికి పార్టీ నేతలను దూరంగా ఉంచడం ద్వారా.. ప్రజల్లో మార్పు కోరుకునే వారిని తనవైపు తిప్పుకోనున్నారు.
అదేవిధంగా పార్టీ నేతలను తన వెంటే ఉంచుకోనున్నారు. తద్వారా.. గుంటూరులో సరికొత్త రాజకీయాలకు పెమ్మసాని శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. గతంలో విజయవాడ నుంచి పోటీ చేసిన లగడ పాటి రాజగోపాల్ కూడా.. ఇలాంటి వ్యూహాన్నే అనుసరించి.. విజయం దక్కించుకున్న విషయం గమనార్హం.