మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి ని ఒక పెద్ద పండుగగా చేసుకుంటారు. ఈ పండుగలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి కాగా, రెండవ రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి అలాగే, మూడో రోజు కనుమ. అయితే, కనుమ ను పాడి పశువుల పండగ అని అంటారు. ఈ రోజున రైతులు సంవత్సరం పొడవునా వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సహాయపడిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అలాగే రైతులు పెద్దమనసుతో తమకు పండిన పంటను తామే కాకుండా పశుపక్ష్యాదులతో పంచుకోవాలని ఇంటి గుమ్మాలకు పిట్టల కోసం ధాన్యపు కంకులను కడతారు.
అయితే మన పూర్వీకులు ‘కనుమ రోజున కాకులు కూడా కదలవు’ అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చెయ్యకూడదని చెబుతుంటారు. ఎన్నో తరాలుగా అనుసరిస్తున్న ఈ సంప్రదాయ నియమాల వ్యాప్తికి వెనుక ఉన్న కారణాన్ని పరిశీలిస్తే, మనకు పల్లెల్లో పశువులే గొప్ప సంపద. పంటలను పండించడంలో వీటి పాత్ర ఎంతో గొప్పది.
ఆ రోజు నదీ తీరాలు మరియు చెరువుల వద్దకు పశువులను తీసుకెళ్లి స్నానం చేయించిన తర్వాత వాటికి నుదట పసుపు కుంకుమలు దిద్దుతారు రైతులు. ఆ తర్వాత పశువులకు మువ్వల పట్టీలతో చక్కగా అలంకరించి హారతులిచ్చి పూజించడం మనం చూస్తూ ఉంటాం. అంతటి గొప్ప సంస్కృతి కనుమ రోజున మన రెండు రాష్ట్రాలలో కనబడుతుంది. అయితే కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటూ పూర్వ కాలంలో వాస్తవానికి పూర్వం ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లే ఉపయోగించేవారు. కనుమ రోజున ఎడ్లను పూజించి వాటికి పూజలు చేస్తారు కాబట్టి ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో బళ్లు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెప్పేవారు.