వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ మరోమారు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.
నేడు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఎప్పట్లాగే రకరకాల అంచనాలు, విశ్లేషణలు, వివరణలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఊహలు కొనసాగుతున్నాయి.
కేంద్రం వైఖరితో కొత్త చర్చ
ఏపీలో పాలనా వికేంద్రీకరణ పేరిట అమరావతిలో శాసన రాజధాని మాత్రం కొనసాగిస్తూ పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని, న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు హైకోర్టు తరలించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వివాదం చెలరేగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరనుందా? అనే చర్చ మొదలైంది. తాజాగా వైఎస్ జగన్ ఢిల్లీ టూర్లోనూ మీడియా సర్కిల్లలో మళ్లీ ఎన్డీయేలోకి జగన్ పార్టీ అంటూ సహజంగానే ప్రచారం జరుగుతోంది.
ఆర్థిక కష్టాలు అసలు విషయమా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, ప్రస్తుతం కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కొద్దికాలం క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రూ.3,805 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయడానికి సహకరించాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదల ప్రక్రియ సంక్లిష్టంగా ఉన్నందున నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. కాబట్టి ఈ ప్రక్రియను సులభతరం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి తన లేఖలో ప్రధానమంత్రిని కోరారు. ఈ విషయాలను రాజ్యసభలో విజయసాయి రెడ్డి మరోమారు వెల్లడించారు. డిసెంబర్ 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన జల శక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు ఆమె సభకు తెలిపారు. త్వరలోనే ఈ మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ విషయంలో కేంద్రానికి కృతజ్ఞత తెలియజేయడంతో ఇతర నిధుల గురించి సైతం ప్రస్తావిస్తారని అంటున్నారు.
తన సమస్యను జగన్ ప్రస్తావిస్తారా?
మాట తప్పను మడమ తిప్పను అనే మాటతో అధికారం కైవసం చేసుకున్న జగన్ ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతున్న తరుణంలో ఆయన ముందున్న సమస్య భవిష్యత్తులో ఇదే నిబద్దత కనబర్చడం అని అంటున్నారు. ఇచ్చిన హామీల అమలు చేయడం కోసం ఖచ్చితంగా నిధుల సమస్య ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిధుల విషయంలోనూ సీఎం జగన్ ప్రస్తావించనున్నారా? అనే టాక్ తెరమీదకు వస్తోంది.
ఇదే జగన్ షెడ్యూల్
మధ్యాహ్నం 3.15 గంటలకు కడప నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్ రాత్రి ఢిల్లీలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. మంగళవారం ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 6న ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ భేటీలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.