టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య వ్యవహారం ఎన్నో కీలక మలుపులు తిరిగింది. ఎస్సార్ నగర్ పోలీసులు ఈ విషయంలో కీలక విచారణ జరుపుతుండగా కొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. శ్రావణి ఆత్మహత్యకు ఒక్క వ్యక్తి కారణం కాదని తెలుస్తోంది.
ముఖ్యంగా శ్రావణి జీవితంలో ఇటీవలే కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఆమె తల్లిదండ్రులు, సాయి కృష్ణారెడ్డి, దేవరాజ్, ఆరెక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి. వీరందరి వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. 2012లో శ్రావణి నటి కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ వచ్చింది. 2015లో సాయి కృష్ణారెడ్డితో పరిచయమైంది. అతని ద్వారా 2017లో ఆరెక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డితో పరిచయమైంది.
అలాగే 2019లో టిక్ టాక్ ద్వారా దేవరాజ్ పరిచయమయ్యాడు. దేవరాజ్ తో క్లోజ్ గా ఉండడాన్ని సాయి కృష్ణారెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. శ్రావణి కుటుంబసభ్యులకు విషయాన్ని చెప్పేసాడు. మరోవైపు దేవరాజ్ ను శ్రావణి పెళ్లి చేసుకుందామని భావించింది. దేవరాజ్ కూడా శ్రావణిని మోసం చేసాడు. శ్రావణి తల్లిదండ్రులు ఆమెను సాయి కృష్ణారెడ్డితో కలిసి హింసించారు. అశోక్ రెడ్డి కూడా సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసినట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
శ్రావణి దేవరాజ్ కు దగ్గర కావడాన్ని అశోక్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడని, అందుకే సాయి కృష్ణారెడ్డితో కలిసి శ్రావణిపై వారిద్దరూ విడిపోవడానికి ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ నెల 7న అమీర్ పేటలోని ఓ హోటల్ వద్ద దేవరాజ్ తో శ్రావణికి గొడవైంది. అనంతరం సాయి కృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అశోక్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇక అందరూ కలిసి ఆమెను శారీరకంగా హింసించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అశోక్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఎస్సార్ నగర్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.