నియోజకవర్గంపై శ్రద్ధ లేదా..? పనులు చేయాలన్న ఆలోచన లేదా..? సొంత డబ్బు పెడుతున్నామన్న ఫీలింగులో ఉండిపోయారా…?? మొత్తానికి ఏమనుకున్నారో ఏమో కానీ తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రం తప్పులో కాలేస్తున్నారు..! జేబులో డబ్బులు పెట్టాలన్నట్టు ప్రజాధనాన్ని ప్రజల కోసం వినియోగించడానికి నొప్పులు పడుతున్నారు..! ఆ లెక్కలేమిటో చూద్దాం పదండి..!!
బడ్జెట్ పద్మనాభం సినిమా గుర్తుండే ఉంటుంది. ఒక ఉద్యోగి. పెళ్లి అంటే ఖర్చు కాబట్టి పెళ్లి చేసుకోడు. ఏది చేయాలన్నా రెండు మూడు సార్లు ఆలోచిస్తాడు. ప్రతీ దానికి లెక్కలేసుకుని కాలం గడుపుతుంటాడు…! ఆ సినిమాలో హీరోలం అనుకున్నారేమో తెలంగాణ ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉండి కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయకుండా, పనులను పట్టించుకోలేదు.
సమాచార చట్టం ద్వారా వెలుగులోకి..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందేకదా. ప్రతి ఏటా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి పనులను విడుదల చేయడం ఆనవాయితీగానే వస్తున్నది. అసలు ఈ ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అనుమానంతో ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు ద్వారా 2014-15 సంవత్సరం నుండి అయిదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎంత మొత్తం నిధులు కేటాయించారు. ఏంత మేర నిధులు ఖర్చు చేశారు అనే వివరాలను అడగ్గా రాష్ట్ర ప్రణాళికా శాఖ అతనికి వివరాలు అందజేసింది.
ఐదేళ్లలో 492 కోట్లు మిగిల్చారు…!!
తెలంగాణలోని ఎమ్మెల్యేలకు “నియోజకవర్గ అభివృద్ధి నిధుల పద్దు”లో రూ.1440కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఏమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ఏటా రూ.3 కోట్ల చొప్పున విడుదల చేసే నియోజకవర్గ అభివృద్ధి నిధులతో వారి వారి ప్రాంతాల్లో సిసి రోడ్లు, మట్టి రోడ్లు, డ్రైనేజీలు, బస్ షెల్టర్ ఇతర ప్రజావసరాల పనులకు వెచ్చిస్తుంటారు. కెసిఆర్ మొదటి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలకు రూ.1440 కోట్లు విడుదల చేయగా అందులో 947.85 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా 492.15కోట్లు మిగిలిపోయాయి. దాదాపు 50 ఎమ్మెల్యేలు కనీసం సగం కూడా ఖర్చు చేయలేదు. ఇవన్నీ మూలలో మూలగడం తప్పితే ఏం ప్రయోజనం..! అదే జనం కోసం ఖర్చు చేసి ఉంటె ఎంతో కొంత ప్రయోజనం ఉండేది.
ఎమ్మెల్సీలు మరీ దారుణం.,!!
ఎమ్మెల్యేలు 492 కోట్లు… అంటే సుమారుగా 35 శాతం మిగిలిస్తే… ఎమ్మెల్సీలు ఏకంగా 43 శాతం వరకు మిగిల్చారు. ఈ ఐదేళ్లలో ఎమ్మెల్సీలకు 460.5 కోట్లు విడుదల చేయగా 254.08కోట్లు మాత్రమే ఖర్చు చేసి 206.42 కోట్లు మిగిల్చారు. అప్పుడు నిధులు ఉన్నా ఖర్చు చేయడానికి వెనుకాడారు. ఇప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగినా ప్రభుత్వం విడుదల చేసే పరిస్థితిలో లేదు. కరోనా లాక్ డౌన్ అమలు కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మేర దెబ్బతిన్నది. దీనితో 2019-20 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇదే కరోనా సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం కూడా లోక్ సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు ఏటా అయిదు కోట్లు చొప్పున విడుదల చేసే ఏంపి ల్యాడ్ నిధులకు మంగళం పాడింది. ఏటా విడుదల అయ్యే నిధులు ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల కాకపోవడంతో నియోజకవర్గాల్లో అభివృద్ది పడకేసింది. నియోజకవర్గంలో ఏ చిన్న పని చేయాలన్నా ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి పనుల జాబితా చాంతాడంతగా పెరిగిపోతున్నాయి.