రాయ్బరేలీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార ఘటన బాధితురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన పధకం ప్రకారం చేసిందేనని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది. బిజెపి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన అత్యాచార బాధిత యువతితో పాటు మరో ఇద్దరు మహిళలు, వారి తరపు న్యాయవాది కారులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారును లక్నోకు సుమారు 45 కిలో మీటర్ల దూరంలో వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా అత్యాచర బాధితురాలైన యువతి, జూనియర్ న్యాయవాది విమల్ కుమార్ యాదవ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాయబరేలిలో జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న అత్యాచార బాధితురాలి బంధువులను కలిసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం కురుస్తోందని పోలీసులు తెలిపారు.
ఉద్యోగ అభ్యర్థన నిమిత్తం వచ్చిన తనపై బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సెంగల్, అతని అనుచరులు కలిసి అత్యాచారం చేశారనీ ఆ యువతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోవడం ఉత్తరప్రదేశ్లో సంచలనం కల్గించింది. ఈ కేసులో బిజెపి ఎమ్మెల్యే, అతని సోదరుడు ప్రస్తుతం జైలులో ఉన్నారు.
ఈ ప్రమాద ఘటనకు బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సెంగల్యే కారణమని బాదితురాలి తల్లి ఆరోపిస్తోంది. ఆయన అరెస్టు అయి జైలులో ఉన్నప్పటికీ ఆయన మనుషులు తమను బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది.
ప్రమాదానికి కారణమైన ట్రక్కు నెంబర్ ప్లేట్ బ్లాక్ పెయింట్తో చెరిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో బాధితురాలితో ఉన్న భద్రతా సిబ్బంది కూడా లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. ప్రాధమిక సమాచారం మేరకు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశామనీ, బాధితురాలి కుటుంబ సభ్యులు సిబిఐ దర్యాప్తు కోరుకుంటే పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.