(హైదరాబాదు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు వివిధ రాష్ట్రాలు సాయం అందిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పళనిస్వామి పది కోట్లు సాయం చేయడంతో పాటు వరద బాధితుల కోసం మాస్క్లు, బ్లాంకెట్స్ పంపిస్తున్నామని వెల్లడించారు. నేడు పశ్చిమ బెంగాల్ తరపున ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు మమత బెనర్జీ.
వరదల రూపంలో ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చిన ఈ సమయంలో తెలంగాణ ప్రజలకు పశ్చిమ బెంగాల్ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. కొన్ని నెలల క్రితం తమ రాష్ట్రంలోనూ అంఫాన్ తుఫాను వల్ల ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న విషయాన్ని మమత బెనర్జీ గుర్తు చేశారు. తెలంగాణకు వరదలు చేసిన నష్టానికి చింతిస్తున్నామనీ, వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.