ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. వీధులన్నీ జలాశయాలు మారిపోయాయి. దాదాపు 1500 కాలనీలలో వర్షపు నీరు నిలిచిపోయింది. బిక్కుబిక్కు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రజలు పాలకులను, పాలకులు ప్రజలను తప్పుబడుతున్నారు. నగరానికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఒక విధంగా పాలకులది మరో విధంగా ప్రజలది. ప్రజా ప్రతినిధులు, ప్రజలకు మధ్య వాదనలు చూస్తే ఇదే అవుతోంది. ఉప్పల్ ఎమ్మెల్యే వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో పలువురు మహిళలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ పేరు రాసి మరీ ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. వరద వస్తే ముంపు వస్తుందని తెలిసి ఇక్కడ ఇళ్లు ఎందుకు కట్టుకున్నారనీ ఎమ్మెల్యే అంటే, పర్మిషన్ ఎలా ఇచ్చారనీ మహిళలు నిలదీయం చూస్తే తప్పు ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలదీ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దీనికి తోడు హైదరాబాదు చుట్టుపక్కన చెరువులు ఆక్రమించి ఇళ్లు, అపార్ట్మెంట్ లు నిర్మాణం చేశారు. నాలాల ఆక్రమణను అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఈ పర్యవసానంగా వర్షపు నీరు నిలిచే స్థలాలు లేక,. వర్షపు నీరు వెళ్లే తోవ లేక కాలనీలను ముంచెత్తాయి.
ముంపు నివారణ చర్యలపై గతంలో పలు పర్యాయాలు నిపుణులు కమిటీ ఇచ్చిన సూచనలను పాలకలు పట్టించుకోలేదని స్పష్టం అవుతోంది. దాదాపు మూడు కమిటీలు ఇచ్చిన నివేదికలను పాలకులు బుట్టదాఖలు చేశారు. ఒకటి ఆర్థికంగా ముడిపడి ఉండగా మరొకటి నాలాల ఆక్రమణల తొలగింపు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను పూనుకుంటూ రాజకీయంగా సమస్యలు ఏర్పడతాయనీ పాలకులు ముందడుగులు వేయలేకపోయారని భావిస్తున్నారు.
2000 సంవత్సరంలోనూ ఇదే మాదిరిగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం ముంపు నివారణ చర్యలపై అధ్యయనం కోసం కిర్లోస్కర్ కమిటీని వేసింది. ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి 1221 కిలో మీటర్ల పొడవున నాలాలు ఉన్నాయనీ, అందులో 390 కిలో మీటర్ల పొడవు వరకు మేజర్ నాలాలు ఉన్నాయనీ ఈ నాలాల మీద దాదాపు 28వేల ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయని పేర్కొన్నది. వెంటనే నాలాల విస్తరణ పనులు చేపట్టాలని సూచిస్తూ ఇందుకు గానూ సుమారు పదివేల కోట్లు ఖర్చు అవుతుందని కూడా నివేదికలో తెలియజేసింది. 28వేల ఆక్రమణలు తొలగించాలని చూస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని అప్పటి ప్రభుత్వం ఆ నివేదకను పక్కన పట్టేసింది. అదే విధంగా 2007లో ఓయన్స్, ఆ తరువాత జెఎన్టీయు నివేదికలను పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఆర్ఎస్ సర్కార్ హయాంలో రెండేళ్ల క్రితం ఇంజనీర్ల కమిటీ తక్షణం 12వేల ఆక్రమణలు తొలగించాలని సూచించగా అందుకు ప్రభుత్వం సంసిగ్ధత తెలియజేసింది. మొదటి దశ ఆక్రమణల తొలగింపు ప్రారంభం అయ్యేలోగానే స్థానిక ప్రజా ప్రతినిధుల జోక్యంతో నాలాల విస్తరణ పనులు ముందుకు సాగలేదని సమాచారం.