(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
భారీ వర్షాలు, వరదల కారణంగా గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రామంతపూర్ పెద్ద చెరువు ముంపు ప్రాంతాలలో పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి వరద బాధిత మహిళల నుండి నిరసన ఎదురైంది.
చిన పడవలో రోడ్డుపైన వరద నీటిలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి వెళుతుండగా రవీంద్రనగర్ కాలనీ మహిళలు ఇంటి డాబాలపై నుండి ఆయనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మూడు రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నాం, ఏవరూ పట్టించుకోలేదు అంటూ నిలదీశారు. మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటాం అంటూ బెదిరించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల్లో ఇల్లు ఎందుకు కట్టుకున్నారని ఎమ్మెల్యే, పర్మిషన్ ఎలా ఇచ్చారు అని మహిళలు వాదనకు దిగారు. దీంతో ఎమ్మెల్యే వారికి సర్ధిచెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు.
హైదరాబాదు శివారు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 32 సెంటీ మీటర్లు, నగరంలోని పలు వార్డుల్లో 20 నుండి 29 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లోని వరద ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలనీలలో నిలిచిపోయిన నీటిని తరలించే ప్రయత్నాలను జీహెచ్ఎంసి అధికారులు చేస్తున్నారు. రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసి అధికారులు వార్డుల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.