YS Jagan : చత్తీస్ గడ్ లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో వివిధ రాష్ట్రాలుక చెందిన 24 మంది జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఏపికి చెందిన ఇద్దరు జవానులు అమరులైయ్యారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ మావోయిస్టుల కాల్పుల్లో అమరులైయ్యారు.
ఈ ఘటనపై ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అయన అన్నారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవానుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వీరి కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఆర్థిక సహాయాన్ని తక్షణం బాధిత కుటుంబాలకు అందించి బాసటగా నిలవాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.
చత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ – సుక్మా జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా మవోయిస్టులు, జవానులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా 24 మంది జవానులు అమరులైయ్యారు. 31 మంది గాయపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ఉదయం చత్తీస్ గడ్ సీఎం భూపేష్ భగేల్ లతో కలిసి జగదల్ పూర్ లో వెళ్లి 14 మంది అమర జవానుల మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం జవాన్లపై దాడి జరిగిన ప్రాంతాన్ని అమిత్ షా సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను అమిత్ షా పరామర్శించారు.