తెలంగాణ సర్కార్ తీసుకునే కొన్ని నిర్ణయాలు సంచలనంగా ఉంటాయా… సంచలనంగా ఉండాలని అలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే సంగతి కాసేపు పక్కన పెడితే… తాజాగా తెలంగాణ సర్కార్ మరో (సంచలన) నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం విద్యార్థులకు ప్రయోజనమా, కాదా అనేదానిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. 1 నుంచి 9వ తరగతి వరకూ అయితే ఆ లెక్క వేరు.. కానీ ప్రతిభకు కొలమానంగా భావించే పదోతరగతి పరీక్షల విషయంలో సర్కార్ మరోలా ఆలోచించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని భావించి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 5,34,903 మంది విద్యార్థులు పరీక్షలు రాయనవసరం లేకుండానే పైతరగతికి వెళ్లనున్నారు. మరి వీరికి ఏ ప్రాతిపదికన గ్రేడులు ఇస్తారు అంటే… గతంలో వారి వారి పాఠశాలల్లో నిర్వహించిన “ఇంటర్నల్ అసెస్మెంట్” పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడులను నిర్ణయిస్తారు.
తెలంగాణలో గుడులు తెరిచారు, మద్యం షాపులు తెరిచారు, షాపింగ్ మాల్స్, సిటీబస్సులు, బార్ లు, రెస్టారెంట్లు… సినిమా హాళ్లు తప్ప అన్నీ తెరవడానికి ధైర్యం చేసిన సర్కార్… పదోతరగతి పరీక్షలు నిర్వహించే క్రమంలో ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోతుంది? అని వినిపిస్తున్న ప్రశ్నల సంగతి అలా ఉంటే… అసలు ఈ పరీక్షలు నిర్వహించకపోవడం తెలంగాణ లోని పదో తరగతి విద్యార్థులకు ఎంతవరకూ ప్రయోజనకరం అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే… మెరిట్ స్టూడెంట్స్ ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు.
ఇంటర్నల్ మార్కులను ఆధారంగా చేసుకుని గ్రేడ్లు ప్రకటిస్తారు అని చెబుతున్న నేపథ్యంలో… ప్రభుత్వ పాఠశాలలు విషయంలో ఈ ఇంటర్నల్ మార్కులు కరెక్ట్ గానే ఉన్నా, కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు మార్కుల్లో అవకతవకలకు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందనేది కాస్త బాగా చదివే విద్యార్థులు, వారి తల్లితండ్రుల డిమాండ్ గా ఉంది!
అయితే కేసీఆర్ తీసుకున్న ఈ విషయంలో జగన్ సర్కార్ ఏమాత్రం ఏకీభవించడం లేదని తెలుస్తుంది. ఏది ఏమైనా… ఏపీలో పదోతరగతి పరీక్షలు నిర్వహించి తీరాలని జగన్ సర్కార్ ఫిక్సయ్యింది. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఎన్నో పనులు చేస్తున్న తరుణంలో… మరిన్ని జాగ్రత్తలు తీసుకుని పదోతరగతి పరీక్షలు పక్కాగా నిర్వహించాలని చూస్తుంది. దీనికోసం ఇప్పటికే 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించిన ఏపీ సర్కార్… జూలై 10 నుంచి 17వ తేదీ వరకూ ఈ పరీక్షలు నిర్వహించనుంది!