ఎవ్వరూ ఊహించని విధంగా అన్నట్లుగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది వైఎస్సార్సీపీ! రికార్డుస్థాయిలో ప్రజల మద్దతుతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో ఈస్థాయిలో పార్టీని జనం నమ్మినప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉండాలి? ప్రస్తుతం సంక్షేమాన్ని సెట్ చేసే పనిలో ఉన్న జగన్ కు మద్దతు ఎలా తెలపాలి? ఈ విషయంలో వైకాపా ఎమ్మెల్యేలు కొందరు చాలా వెనకబడిపోయారని అంటున్నారు!
సాధారణంగా సంక్షేమ ఫలాలి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడం సంగతి కాసేపు పక్కనపెడితే… వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు కీలక భూమిక పోషిస్తుంటారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలు జనాలకు ఎంతశాతం అందాయన్న విషయం కాసేపు పక్కన పెడితే… వాటికి వారిచ్చిన ప్రచారం మామూలుది కాదు! కానీ ఈ విషయంలో వైకాపా ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
అవును… ఏపీలో జగన్ అందుస్తోన్న సంక్షేమ ఫలాలు, ప్రభుత్వ పథకాలు దాదాపు అర్హులైన అందరికీ అందుతున్నాయి కానీ… వాటి ప్రచారం విషయంలో… ఎమ్మెల్యేలకు వాటిపై అవగాహనలేకో, లేక నిర్లక్ష్యం, వైరాగ్య భావనల ఫలితంగానో కానీ.. ఆ పథకాల గొప్పతనాన్ని, వాటిని అందించడంలో కరోనా కష్టకాలంలో ప్రభుత్వం పడిన ఇబ్బందులను కానీ ప్రజలకు వివరించడంలో పరిపూర్ణంగా ఫెయిలవుతున్నారు!
పనిచేయకుండానే పబ్లిసిటీ చేసుకునేవాళ్లు కోకొల్లలుగా ఉన్న ఈ నాటి రాజకీయాల్లో… ఇంత పని చేస్తూ కూడా నియోజకవర్గ స్థాయి పబ్లిసిటీ విషయంలో దారుణంగా వెనుకబడిపోవడంపై జగన్ చాలా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అపాయింట్ మెంట్ ఇవ్వలేదనో.. స్వేచ్చను ఇవ్వలేదనో జగన్ పై అలిగి గనుక ఇలాంటి పనులకు ఎమ్మెల్యేలు పాల్పడుతుంటే మాత్రం… వారు కూర్చున్న కొమ్మను వారే నరుక్కున్నట్లవుతుందన్న విషయం వారు గుర్తుపెట్టుకోవాలని పలువురు ఈ సందర్భంగా సూచిస్తున్నారు!!