ఢిల్లీ, జనవరి 23: నరోడా పటియా కేసులో నలుగురు దోషులకు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న ఉమేశ్ భాయ్ బర్వాడ్, రాజ్ కుమార్, హర్షద్, ప్రకాష్ భాయ్ రాథోడ్లకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2002 ఫ్రిబవరి 28న అహ్మాదాబాద్లోని నరోడా పటియా ప్రాంతంలో జరిగిన అల్లర్లలో 97మంది ముస్లింలు హత్యకు గురయ్యారు. గోధ్రా సంఘటన అనంతరం గుజరాత్లో చోటు చేసుకున్న మారణహోమంలో ఈ నరమేధం చోటుచేసుకుంది. గోద్రాలో జరిగిన రైలు దహనం కేసులో 59మంది హిందువులు హత్యకు గురయ్యరు. దీనిపై పెద్ద ఎత్తున హిందుత్వవాదుల గుంపులు అల్లర్లకు పాల్పడ్డారు.
నరోదా పటియా ఘటనకు సంబంధించి 16మందిని దోషులుగా 18మందిని నిర్దోషులుగా గత ఏడాది గుజరాత్ హైకోర్టు గుర్తించి శిక్షలు ఖరారు చేసింది. దోషులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దోషుల్లో బజరంగ్ దళ్ నేత బాబు బైరంగి ఉన్నారు. బిజెపి మాజీ మంత్రి మాయ కొద్నానిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది.
దోషులకు బెయిల్ ఇస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం, వారి దోష నిరూపణ పరిశీలనకు అర్హమైనదని వ్యాఖ్యానించింది.