Amit Shah: ఏపీ రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టులపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్ధి సత్యకుమార్ కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీత తో కలిసి కూటమి ముఖ్య నేతలు సభలో పాల్గొన్నారు. తొలుత అమిత్ షా కు చంద్రబాబు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత చంద్రబాబును కూడా అమిత్ షా శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, దౌర్జన్యకర పాలన అంతం చేసేందుకు టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. ఆంధ్రాలో భూమాఫియాను అంతం చేసేందుకు, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని అన్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడుతామని తెలిపారు. జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రాధమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని తొలగించడంపై ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను రక్షిస్తామని చెప్పారు. బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను అంతం కానివ్వమని అన్నారు. ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని అమిత్ షా అన్నారు. జగన్ అవినీతిలో కూరుకుపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోడీ సర్కార్ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి అవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. దేశాన్ని రక్షించేందుకు, ఉగ్రవాదులు, నక్సలైట్లను అరికట్టేందుకు మోడీని మళ్లీ ప్రధానిని చేయాలన్నారు. మూడో సారి ప్రధాని అయ్యేది మోడీనేనని అన్నారు. ఉమ్మడి ఏపీని చంద్రబాబు ప్రధమ స్థానంలో నిలిపారని అన్నారు. విభజన తర్వాత కూడా ఏపీని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లారని చెప్పారు. ఆయన చేసిన అభివృద్ధిని జగన్ అధోగతి పట్టించారని విమర్శించారు.
జగన్ మద్య నిషేదం చేస్తానని మాట తప్పారన్నారు. ఆరోగ్య శ్రీకి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు, మోడీని గెలిపిస్తే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 25కి 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లతో చంద్రబాబును సీయం చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
ఇండియా కూటమిపైనా అమిత్ షా విమర్శలు గుప్పించారు ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ.. వీరిలో ఎవరిని చేస్తారో చెప్పాలన్నారు. ఆ కూటమిలో ప్రధాని అభ్యర్ధే లేరని ఎద్దేవా చేశారు అమిత్ షా.
AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు