సున్నా నుండి అయిదుకి రావడమే కష్టం..! ఆ అయిదుని వంద చేసుకోవడం పడ్డ కష్టమేమి కాదు..! బీజేపీ ఇప్పుడు అదే పనిలో ఉంది. ఆ రాష్ట్రంలో అసలు క్యాడర్ లేని ఆ పార్టీ 2014 లోక్ సభ ఎన్నికల్లో 2 స్థానాలు గెల్చుకుంది. 2019 లో ఏకంగా 18 స్థానాలు గెలిచింది. ఇప్పుడు అక్కడ సీఎం కుర్చీకి టార్గెట్ పెట్టింది..! ఆ దిశగా కదలికలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కీలక ఎమ్మెల్యే సువెందు అధికారి సహా పది మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా మమతకు బెంగ కలిగించేలా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు వీక్ అయ్యాయి, ఇక తనకు తిరుగులేదు అనుకున్న మమతకి బీజేపీ చుక్కలు చూపిస్తుంది. మమతని గెలిపించడానికి వందల కోట్లు అగ్రిమెంట్ కుదుర్చుకున్న పీకే (ప్రశాంత్ కిషోర్)కి కూడా చుక్కలుసహా.., దిక్కులు కూడా కనిపిస్తున్నాయి..!!
అమిత్ షా ప్రత్యేక స్ట్రాటజీ..!!
పీకే (ప్రశాంత్ కిషోర్) గొప్ప అనుకుంటాం కానీ.., దేశంలో అమిత్ షాని మించి ఎన్నికల స్ట్రాటజిస్టు లేరు. ఆయన ఎప్పుడు, ఎక్కడ ఏం చేయాలో అదే చేస్తారు. అవసరం అనుకుంటే తనకు గిట్టని పాముకి పాలు పోస్తారు. అవసరం లేదు అనుకుంటే తనకి నచ్చే కుక్కని తన్ని తరిమేస్తారు. సింపుల్ గా చెప్పుకోవాలి అంటే… అవసరం అనుకుంటే రాష్ట్రాల్లో చిన్న చిన్న పనికిమాలిన పార్టీలను తనకు అనుకూల పావులుగా వాడుకుంటారు. అవసరం లేదు అనుకుంటే చిన్న, పెద్ద పార్టీలని విచ్చిన్నం చేసేసి తొక్కేస్తారు. బీహార్ లో జరిగింది అందే, పశ్చిమ బెంగాల్ లో జరగబోయేది అదే. అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బెంగాల్ ఎన్నికలపై అమిత్ షా పూర్తి దృష్టి పెట్టారు. నిన్న జరిగిన మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. తృణమూల్ లో మమత తప్ప ఇంకెవ్వరూ మిగలరు అంటూ తమ ప్రణాళికని పరోక్షంగా చెప్పేసారు. అక్కడ చీమ కదిలినా అమిత్ షాకి తెలియాల్సిందే. అక్కడ గ్రామస్థాయిలో జరిగే ప్రత్యర్థి పార్టీల మార్పులు కూడా అమిత్ షాకి రోజువారీ నివేదికల రూపంలో వెళ్తున్నాయంటే ఇక చూసుకోవచ్చు ఆయన శ్రద్ధ..! అమిత్ షా సహా 120 మంది బీజేపీ ప్రత్యేక టీమ్ ఢిల్లీ నుండి బెంగాల్ ఎన్నికలను, ఎన్నికల ప్రణాళికలను మోనిటర్ చేస్తుంది. అమలు చేస్తుంది.
భారీగా చేరికలు మొదలు..!!
బీజేపీకి ఊపొచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలతోనే బీజేపీకి అక్కడ జోష్ పెరిగింది. అందుకే ఇప్పుడు ఆ జోష్ ని మరింత రెట్టింపు చేసుకుంటుంది. బీజేపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్యేలు ముగ్గురు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు చేరడానికి సిద్ధమయ్యారు. జనవరి నాటికి తృణమూల్ ఎమ్మెల్యేలు కూడా నలుగురు సిద్ధంగా ఉన్నారని స్వయంగా అమిత్ షా వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అమిత్ షా టీమ్ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించి.., బెంగాల్ లో రాజకీయం మొత్తం ఢిల్లీ నుండి నడిపిస్తుంది.
పీకేకి తొలి ఓటమి..!?
బెంగాల్ లో మమత కి తిరుగులేదు. అందుకే ఆమె ఇక ఆ రాష్ట్రంలో తనే దిక్కు అనుకునేలా చెలరేగిపోయారు. లెఫ్ట్ పార్టీలను విచ్చిన్నం చేశారు. కాంగ్రెస్ ని కకావికలం చేశారు. బీజేపీని కూడా చేయబోయి తనే దెబ్బ తింటున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ ని తనకు ఎన్నికల స్ట్రాటజిస్టుగా తెచ్చుకున్నారు. ఏపీలో జగన్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ లాగా బెంగాల్ లో మమత పార్టీ తరపున ప్రశాంత్ కిషోర్ రాజకీయం నడుపుతున్నారు. కానీ అక్కడ ఆయన పప్పులు ఉడకడం లేదు. క్షేత్రస్థాయిలో తృణమూల్ కార్యకర్తలు, నాయకుల సరళి… పైన ఈ స్ట్రాటజిస్టు ఆలోచనలు కలవడం లేదు.
* లెఫ్ట్ పార్టీల్లోని ఆరుగురు ఎమ్మెల్యేలను తృణమూల్ లో చేర్చుకోవాలి అని పీకే ప్లాన్ వేస్తే ఈ ఆరుగురిలో నలుగురు బీజేపీకి జై కొట్టారు.
* ముస్లిం ఓట్లు కోసం పీకే ఒక ప్రత్యేక ఎన్నికల ప్రణాళిక రూపొందించి.., మమత చేత అమలు చేయించాలి అనుకుంటే.. బీజేపీ లోపాయికారీ సహకారంతో బెంగాల్ లో ఎంఐఎం రంగంలోకి దిగబోతుంది. కేవలం మమతకి అనుకూల ఓట్లను కొల్లగొట్టేలా ఇది భారీ ప్లాన్. ఎంఐఎం వలన సుమారు 20 స్థానాల్లో మమతకు దిబ్బ తప్పకపోవచ్చు.
* కాంగ్రెస్ నుండి, లెఫ్ట్ పార్టీల నుండి తృణమూల్ లో చేరుతారు అనుకుంటున్నా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తుండడం.., వారితో రెండు నెలల నుండి పీకే టీమ్ సంప్రదింపులు చేస్తుండడం.. అయినా ఫలితం లేకపోవడం పీకేకి దిక్కులు, చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తన ప్యాకేజీలో ఓటమి లేదు. తొలిసారి పీకేకి ఓటమి భయం కూడా వెంటాడుతుంది..!!