అమరావతి, జనవరి 26:విభజన హామీల అమలు కోసం తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్పందించకపోవడం చాలా బాధకరమని ప్రత్యేక హోదా-విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు విషయంలో తమిళ సినీ పరిశ్రమ ఒకే తాటిపైకి వచ్చి తమ వంతు సహకారం అందించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా చిత్రపరిశ్రమ స్పందించాలని ఆయన కోరారు.
రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి ఒకటవతేదీన బంద్కు పిలుపివ్వనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రం గుజరాత్కు 500 కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్లో కేటాయించిందని ఆయన చెప్పారు. వచ్చే నెల ఒకటవ తేదీన ఓట్ ఆఫ్ ఫేజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు.