విజయనగరం, జనవరి 25: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసిపి నేత, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నెల్లిమర్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో ముగ్గురు వ్యక్తులు గురువారం రాత్రి ఓటర్ల లిస్ట్తో సర్వే చేస్తుండగా వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న ట్యాబ్లను మంత్రి బొత్సా అనుచరుడు, వైసిపి నాయకుడు మజ్జి శ్రీను స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తులను పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
వైసిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ట్యాబ్లతో ప్రైవేటు వ్యక్తులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ట్యాబ్లను ఎన్నికల అధికారులకు గానీ డిజిపికి గానీ అప్పగిస్తామని వైసిపి నేతలు చెప్పారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ట్యాబ్లను అప్పగించాలని మజ్జి శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలియగానే మాజీ మంత్రి, వైసిపి నేత బొత్సా సత్యనారాయణ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తోందని, నిందితులపై చర్యలు తీసుకోకుండా తమ పార్టీ వారిని అదుపులోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళతానని తెలిపారు.