ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక రోజు ప్రభుత్వం గెలిస్తే మరో రోజు ఎన్నికల కమిషన్ కు అనుకూలమైన తీర్పులు కోర్టు వ్యాఖ్యానాలు బయటకు వస్తున్నాయి. అసలు మొత్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఆటల్లో చివరికి గెలుపు ఎవరిది? ప్రభుత్వం తరఫున జగన్ గెలుస్తారా ఎన్నికల కమిషన్ తరఫున నిమ్మగడ్డ గెలుస్తారా అన్నది కీలకంగా మారుతోంది. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై తుది తీర్పు ను రెండు రోజుల పాటు వాయిదా వేసింది.. అంటే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 23వ తేదీ నుంచి ఇవ్వడంతో ఖచ్చితంగా జనవరి 22 లోపు హైకోర్టు బెంచ్ మీద తీర్పు చెప్పాల్సి ఉంది. దీంతో రెండు రోజుల్లో మరో న్యాయ అంశం తెర మీదకు రానుంది. ఒకవేళ ఎవరికి అనుకూల తీర్పు వచ్చినా వ్యతిరేక తీర్పు వచ్చినా మళ్లీ దీనిని అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు చేసేందుకు వెళతారు అన్నది అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి హైకోర్ట్ బెంచ్ తీర్పుతో ఇటు ఎన్నికలు జరుగుతాయని చెప్పడం ఆగిపోతాయని చెప్పలేము…
ఆలస్యం చేయడమే!
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం పెట్టడానికి సిద్ధంగానే ఉంది. అయితే ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ పదవి కాలం పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎన్నికల కమిషనర్ను పలు మాటలు అన్న జగన్.. కచ్చితంగా నిమ్మగడ్డ వెళ్ళిన తర్వాతే ఎన్నికలు నిర్వహించుకోవాలని భావిస్తున్నారు. దీనివల్ల నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు జరపలేదు అన్న విషయాన్ని, ప్రభుత్వ సామర్థ్యాన్ని పార్టీ నాయకులకు చెప్పినట్లు అవుతుంది. దీంతోపాటు జగన్ పంతం నెరవేరుతుంది. దీంతో న్యాయపరంగా ఎదుర్కొంటూనే నిమ్మగడ్డ పదవి కాలం దగ్గర పడేలా ఈ విషయాన్ని ఆలస్యం చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాజ్యాంగపరంగా న్యాయపరంగా ఎన్నికల కమిషన్ అధికారాలను సవాలు చేసే… వ్యవస్థ పాలకులకు ప్రభుత్వానికి లేదు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికీ తెలుసు. అయితే ఖచ్చితంగా ఈ విషయంలో విజయం సాధించకపోయినా అప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం పూర్తయ్యే సమయానికి ఈ కేసును డిలే చేసేలా చూడటమే ముందున్న లక్ష్యం.
జగన్ ఢిల్లీ టూర్ లో…
న్యాయవ్యవస్థ పరంగా ముందుగా చిక్కులు ఎదుర్కొన్న జగన్… తర్వాత పలుమార్లు ఢిల్లీ పర్యటన తర్వాత న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి కొత్త న్యాయమూర్తులను ఢిల్లీ కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో విజయం సాధించారు. దాని తర్వాత న్యాయ వ్యవస్థలో కొన్ని కీలకమైన తీర్పులు విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలమైన ఈ సంకేతాలు అందాయి అనడంలో సందేహం లేదు. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను రాత్రివేళ ఏకాంతంగా కలవనున్నారు. దీంట్లో పలు కీలకమైన విషయాలను ఆయనతో చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. అమిత్ షాతో భేటీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల మీద సైతం హైకోర్ట్ బెంచ్ లు ఏమాత్రం వ్యతిరేక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టులో వెంటనే అప్పీలుకు వెళ్లేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధపడుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ పెద్దల సహాయ సహకారాలు జగన్ అడిగే అవకాశాలు లేకపోలేదు. అక్కడ వ్యవహరించాల్సిన తీరు మీద అమిత్షాతో జగన్ చర్చించనున్నారు అన్నది ఢిల్లీ వర్గాల మాట.
ఎన్నికల కమిషన్ ఎం చేయబోతుంది??
హైకోర్టు బెంచ్ తీర్పులో ఎన్నికల కమిషన్ కు ఏమాత్రం వ్యతిరేకమైన తీర్పు వచ్చినా దానిని సైతం వారు అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిమీద కచ్చితంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కొందరు టిడిపి పెద్దలు సైతం ఆర్థికంగానూ నైతికంగా నేను సహకారం అందించే అవకాశాలు లేకపోలేదు. దీనిలో ఇప్పటికే కొందరు పెద్ద తలకాయలు తలదూర్చడం తో వ్యవహారం రోజురోజుకు జటిలమవుతుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల విషయం ఏం జరగబోతోంది ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది అన్నది కీలకంగా మారింది. ఇటు రాజకీయంగా అటు న్యాయపరంగా కూడా ఈ కేసు ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారయింది.