రాష్ట్రంలో, దేశంలో మహిళలు, బాలికల రక్షణకు ఎన్ని రకాల కఠిన శిక్షణలు తీసుకువస్తున్నా వేదింపులు, దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతునే ఉన్నాయి. ప్రేమించడం లేదని ఒకడు, ప్రేమించి వదిలివేసిందని మరొకడు, వేరే యువకులతో స్నేహంగా ఉంటుందని మరొకడు ఇలా ఏదో ఒక కారణంతో ఉన్మాదులుగా మారి యాసిడ్ దాడులకు పాల్పడటం లేక కత్తితో దాడి చేయడం లాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నేడు చిత్తూరు జిల్లాలో ప్రేమోనాద్మి పాశవిక దాడిలో ఒ యువతి అసువులు బాసింది. ఉన్మాదిలా నడిరోడ్డుపైనే కత్తితో విచక్షణారహితంగా ఆ యువతిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే..చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి (20) డిగ్రీ చదువుతున్న సమయంలో పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు అనే యువకుడిని ప్రేమించింది. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో గత నెల రెండవ వారంలో పెద్దలకు చెప్పకుండా తిరుపతికి వెళ్లి రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే గాయత్రి ఇంట్లో వారికి చెప్పకుండా వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీరిద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో గాయత్రి తల్లిదండ్రుల వద్దే ఉంటానని చెప్పడంతో ఆమెను పోలీసులు పేరెంట్స్ కు అప్పగించారు.
అయితే తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మళ్లీ తల్లిదండ్రుల వద్దకు గాయత్రి వెళ్లిపోవడాన్ని ఢిల్లీ బాబు జీర్ణించుకోలేకపోయాడు. ఆమెపై ధ్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ రోజు గాయత్రి తమ బంధువుల అమ్మాయితో కలిసి బైక్ పై ఇంటికి వెళుతుండగా ఎంపరాల కొత్తూరు వద్ద దారి కాచి గాయత్రిని అడ్డుకున్నాడు. తీవ్ర ఆగ్రహంతో కత్తితో విచక్షణారహితంగా గాయపరిచి పరారైయ్యాడు. తీవ్రంగా గాయపడిన గాయత్రిని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో తమిళనాడు లోని వేలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఢిల్లీ బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలోనే హతురాలి బంధువులు చింతమాకుల పల్లి గ్రామంలో ఢిల్లీ బాబు ఇంటిపై దాడి చేశారు. గాయత్రి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి..పంచాయతీ పోల్స్ తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు .. !!