ఏపిలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు లో విచారణ ముగిసింది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరపున దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. పిటిషన్ లను అనుమతించేది లేదంటూ కోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఎస్ఈసీ విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం, ఎస్ఈసీ తరపున వాదనలు పూర్తి అయ్యాయి. దీనిపై నిన్న ఎస్ఈసీ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపున డీవీ సీతారామ్మూర్తి వాదనలు వినిపించారు. మంగళవారం ప్రభుత్వం తరపు వాదనలపై ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఒక సారి ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని ఇంత వరకు ఎక్కడా జరగలేదని అన్నారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయవాది ఆదినారాయణరావు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనలు మిగిసిన అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.