ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి జగన్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ వ్యవహరించిన తీరుకు జగన్ సర్కార్ ఆయన పదవి పోయేలా వ్యవహరించడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. దీనికిగాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవిని కాపాడుకోవడానికి న్యాయస్థానాలలో పోరాడి చివరికి దక్కించుకున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మరోసారి జగన్ ప్రభుత్వంతో డి అంటే డి అనే విధంగా హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్ కు నిధులు ఇవ్వటం లేదని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపివేసినట్లు, ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదన్నట్లు నిమ్మగడ్డ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వెంటనే న్యాయస్థానం కలగజేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నికల కమిషన్ కు రావలసిన నిధులను మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. రాజ్యాంగ లో 243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్ కు నిధులు ఆపేయటం చట్టవిరుద్ధమని నిమ్మగడ్డ పేర్కొన్నారు. కాగా నిమ్మగడ్డ తన పిటిషన్ లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లను చేర్చారు. తాజాగా ఈ పిటిషన్ ను హైకోర్టు ఇటీవల స్వీకరించింది.