తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజగిరి ఎం పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రెబల్ గా మారబోతున్నారా? కాంగ్రెస్ లో వేరు కుంపటి రగిలించి తాడో పేడో తేల్చుకుని తెలంగాణలో కొత్త పార్టీ అధినేతగా అవతరించబోతున్నాడా? ఇవన్నీ ఈ రోజు వరకూ పుకార్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా పార్టీ పెడుతున్నారని గడచిన వారం రోజుల నుండి విపరీతంగా వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు అందరూ ఈ రోజు ధర్నా చేపట్టారు. దానిలో రేవంత్ రెడ్డి కనిపించలేదు. దాంతో రేవంత్ రెడ్డి వేరే పార్టీ పెట్టే సన్నాహాల్లో ఉన్నాడని, కాంగ్రెస్ పట్ల అసంతృప్తిగా ఉన్నాడని ఇన్నాళ్లుగా అనుకుంటున్న శ్రేణులకు ఈ రోజు కాస్త స్పష్టత వచ్చినట్లు అయ్యింది. ఇంతకూ రేవంత్ రెడ్డి ప్లాన్ ఏమిటి ? ఆయన దేనికి హజరు కాలేదని పరిశీలిస్తే…
తెలంగాణలో టిడిపిని బతికించే ప్రయత్నమేనా
తెలంగాణలో జె ఇ ఇ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా పి సి సి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఎం పిలు, కీలక నాయకులు ధర్నా చేపట్టారు. దీనికి రేవంత్ రెడ్డి హజరు కాలేదు. ఇన్నాళ్లుగా రేవంత్ రెడ్డిపై జరుగుతున్న ఒ ప్రచారం ఈ రోజుతో కొంత నిజమేనేమో అనిపించేలా చేసింది. రేవంత్ రెడ్డి ఒక వేళ పార్టీ పెడితే దాని వెనుక ఖచ్చితంగా టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహాలు, ప్రణాళికలు, ఆలోచనలు, ఖచ్చితంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ చంద్రబాబు నాయుడుపై ఈగ కూడ వాలనివ్వడు. తెలంగాణలో ఏ పార్టీ నాయకుడైనా చంద్రబాబును విమర్శిస్తే వంటి కాలిపై లేచి వారిని వడ్డీతో సహా విమర్శిస్తాడు. అటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు అంటే ఖచ్చితంగా తెలంగాణ టిడిపి సంపూర్ణ మద్దతు ఉంటుంది. టిడిపి సహకారంతోనా లేదా టిడిపికి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి పార్టీ ఎలా పెట్టినా ఆ తరువాత టిడిపిని కలుపుకుపోవడం ఖాయమే. అయితే కాంగ్రెస్ లో ఉన్నసన్నిహిత సంబంధాల ద్వారా కొంత మంది కీలక కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రెడ్డితో కలిసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. చూద్దాం మరి కొద్ది రోజులు ఏమి జరుగుతుందో.