BJP: తెలంగాణలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి …. ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా అవకాశం ఇస్తున్నారా? ఇప్పటికే అసంతృప్తితో ఉన్న వర్గాలకు తనంత తానుగా చాన్స్ ఇచ్చేయడం జరుగుతోందా? ఇప్పుడు తెలంగాణలో ఈ హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇదంతా షేక్పేట తాహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీ గురించి. దాని కేంద్రంగా జరుగుతున్న రాజకీయాల గురించి.
BJP మేడమ్ సార్…. మేడం అంతే!
వివిధ మీడియాల్లో , సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బంజారాహిల్స్ పరిధిలో ఇష్టానుసారంగా కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలని గతంలో షేక్పేట్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పై మేయర్ గద్వాల విజయలక్ష్మి చిందులు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తనను బండబూతులు తిట్టడమే కాక విధులకు ఆటంకం కలిగించారని.. కోర్టుకు వెళ్లకుండా అడ్డుకున్నారని అప్పట్లో కార్పొరేటర్ గా ఉన్న గద్వాల విజయలక్ష్మి పై ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ అందునా.. ఒక ఎంపీ కూతురైన విజయలక్ష్మిపైనే పోలీసు కేసు పెట్టడం
కలకలం రేపింది. ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన విజయలక్ష్మి మరోసారి గెలుపొందడమే కాదు.. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో మేయర్ పీఠం దక్కించుకుంది. అలా మేయర్ పీఠంలో కూర్చుందో లేదో.. సంబరాలు ముగిసిన వెంటనే తన ప్రత్యర్థులపై పంతం నెగ్గించుకునే పని చేపట్టినట్లు దుమారం చెలరేగుతోంది.
ఇప్పుడు ఏం జరిగింది?
సదరు సంచలన ఎమ్మార్వో శ్రీనివాసరెడ్డిని సీసీఎల్ఏకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న తాహశీల్దార్ కె.వెంకట్ రెడ్డి నియమించారు. పైకి సాధారణ బదిలీగానే కనిపించినా.. రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగుల ఆగ్రహం
షేక్పేట తాహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీ అన్యాయమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఖండించింది. అకారణంగా బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వక పోవడం దారుణమంటూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రాత్రి పగలు పని చేసినా రెవెన్యూ శాఖలో జరుగుతున్న సంఘటనల పై తీవ్ర అసంతృప్తి చేయడంతోపాటు.. కక్ష సాధింపులా చేసిన బదిలీని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేసింది. తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ జిల్లా నుండి అకారణంగా రాత్రి సమయంలో బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకపోవడం వెనుక కొందరు నాయకుల ఒత్తిడి ఉన్నట్టు తెలిసిందని, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు రెవెన్యూ అసోసియేషన్ ప్రకటించింది. ఆయనకు వెంటనే హైదరాబాద్ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని ట్రెసా నేతలు డిమాండ్ చేసింది. కాగా, ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల్లో టీఆర్ఎస్ పట్ల ఒకింత అసహనం ఉండగా తాజాగా ఈ నిర్ణయం దానికి ఆజ్యం పోస్తుందని ఇదంతా విపక్ష బీజేపీ కి కలసి వస్తుందని కొందరు జోస్యం చెప్తున్నారు.