YS Sharmila : తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలన్న ఆకాంక్షతో రాజకీయ అరంగ్రేటం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల..వరుస బేటీలతో బిజీబిజీగా ఉన్నారు. వివిధ జిల్లాలలోని వైఎస్ఆర్ అభిమానులు, నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. వచ్చే నెల 9వ తేదీన ఖమ్మం వేదికగా షర్మిల పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు. ఇప్పటికే షర్మిల బహిరంగ సభకు తెలంగాణ సర్కార్ అనుమతి కూడా ఇచ్చింది. అయితే పార్టీ ప్రకటన లోపుగానే పలువురు ప్రముఖులను పార్టీలో చేర్చుకునే దిశగా షర్మిల యోచన చేస్తున్నారు.
ఇప్పటికే వైఎస్ షర్మిలను గతంలో రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు సన్నిహితంగా ఉన్న కొందరు నాయకులు, అధికారులు కలిసి మద్దతు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ బాస్ గా బాధ్యతలు నిర్వహించిన ఓ సీనియర్ ఐపీఏస్ అధికారి కూడా షర్మిల పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి స్వర్ణజిత్ సేన్..వైఎస్ హయాంలో డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. స్వర్ణజిత్ సేన్ సతీమణి అనితా సేన్ ఇప్పటికే షర్మిలతో భేటీ అయ్యారు. మద్దతు తెలియజేశారు. వీరి మధ్య రాజకీయ పరమైన అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తొంది. అయితే స్వర్ణజిత్ సేన్ పార్టీలో చేరికపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
వచ్చే నెల 9వ తేదీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయా, లేక ఈ లోపుగానే కొందరు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధానంగా షర్మిల గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రస్తుతం అవేమీ ప్రజలకు అందుబాటులో లేవంటూ కేసిఆర్ సర్కార్ ను విమర్శిస్తున్నారు.