ఏపి బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఒక కొలిక్కి రావడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ ను తప్పించి ఆ బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. కానీ వారికి సరైన నాయకుడు అంతుపట్టడం లేదు. సోము వీర్రాజుకు ఖరారు అయిందంటూ వార్తలు వస్తున్నప్పటికీ అందులో ఎంత మాత్రం నిజం ఉందనేది తెలియడం లేదు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులను సులువుగా ఎంపిక చేసిన బీజేపీ ఏపి విషయానికి వచ్చే సరికి మాత్రం నానా తంటాలు పడుతుంది. దేశం లోని చాలా రాష్ట్రాలకు అధ్యక్షుడు ఎన్నిక పూర్తి అయినప్పటికీ ఏపి మాత్రం పెండింగ్ లో ఉంది. దీనికి కారణం అనేక లాబీయింగ్ లు అని తెలుస్తోంది.
ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
బీజేపీ జాతీయ పార్టీ. కేంద్రంలో అధికారంతో పాటు దేశంలో మంచి పట్టు ఉన్న పార్టీ. దక్షిణ భారత దేశంలో ఇప్పుడిప్పుడే బలపడుతున్న పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో పునాదులు వేసుకుంటున్న పార్టీ. ఈ పార్టీ కి ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షుడి ఎంపిక అత్యంత సున్నిత అంశంగా మారింది. ఇతర రాష్టాలతో పోలిస్తే ఇక్కడ సామాజిక వర్గ సమీకరణలు, మతాలు, వర్గాలు, పార్టీ లు ఇవన్నీ సున్నిత అంశాలుగా ఉండటంతో బీజేపీ అధిష్టానం అతిచుచి అడుగులు వేస్తున్నది. కన్నా లక్ష్మీనారాయణ నే కొనసాగిద్దామంటే వైసీపీకి ఆశలు పొసగడం లేదు. వైసీపీతో లోపాయికారి చిన్న పాటి బంధం నడుపుతున్న బీజేపీ కి కన్నా ను ఉంచితే వైసీపీ తో తెగతెంపులు తప్పవని ఆందోళన నెలకొన్నది. అందుకే ఇటువైపు వైసీపీ పక్షంలోని కొంత మంది నాయకులు కూడా కన్నా ను తప్పించాలని చూస్తున్నారు. అంటే బీజేపీలోనే కేంద్ర స్థాయిలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడే జేవీఎల్ నర్సింహారావు, దివాకర్ తదితర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ను తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి.
* ఇదే సందర్భంలో ఏపి బీజేపీ అధ్యక్ష పదవిని ఎవరైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వాలని బీజేపీలోని టీడీపీ అనుకూలంగా ఉన్న కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారట. అంటే సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లకు పెద్ద గురువుగా ఉన్న ఒక జాతీయ నాయకుడు వీరంతా కమ్మ సామాజిక వర్గ నాయకుడికి బీజేపీ అధ్యక్షుడి పగ్గాలు ఇస్తే బాగుంటుందన్న ప్రయత్నాల్లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇది కూడా ఎటు తేలని ముడిపడని వ్యవహారంగా తయారు అయ్యింది.
*మరో వైపు కాపు సామాజిక వర్గ నాయకులు, జనసేన తరుపున ఉన్న నాయకులు మాత్రం ఎమ్మెల్సీ మాధవ్ కు బీజేపీ పగ్గాలు ఇవ్వాలని లేదా కన్నా లక్ష్మీనారాయణ ను కొనసాగించాలని పట్టుపడుతున్నారుట. మరో రెండేళ్ల పాటు మాధవ్ లేదా కన్నా లక్ష్మీనారాయణ ఉంటే పార్టీ సంస్థాగతంగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం అవుతుందని డానికి తగ్గ ప్రణాళిక కూడా ఉందని కొంత మంది కాపు సామాజిక వర్గ నాయకులతో సహా జనసేన పట్టుపడుతుందని అంటున్నారు.
మొదటి సారి చిక్కుల్లో పడ్డ బీజేపీ
ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండటం, ఏ సామాజిక వర్గ ప్రయత్నాలు ఆ సామాజిక వర్గం చేస్తుండటం, ఆయా పార్టీల లోపాయికారి ప్రయత్నాలు చేస్తుండటం ఇవన్నీ బీజేపీ పెద్దలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. సాధారణంగా ఇటువంటి లాబీయింగ్ లను ఖాతరు చేయని బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం స్థానిక నేతల అభిప్రాయాలకు అనుగుణంగా అధ్యక్షుడి నియామకం జరగాలని అనుకుంటున్నారట. అందుకే ఏపిలోని బీజేపీ నేతలు అందరూ కలిసి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కేంద్ర పెద్దలు అంగీకారంతో వారిని నియమించాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం. కానీ ఇక్కడ ఏకాభిప్రాయం రాకపోవడం, సామాజిక వర్గాలు, పార్టీలు, రాజకీయాలు అన్ని చూసి ఎవరికి వారు వేరేగా ఆలోచిస్తుండటంతో బీజేపీ కూడా ముప్పు తిప్పలు పడుతోంది. సోము వీర్రాజుకి దాదాపు ఖరారు అయినప్పటికీ అయన టీడీపీకి బద్ద వ్యతిరేకి అని, జనసేన కు కూడా అంతుపట్టకుండా ఉన్నారని, వైసీపీకి మరింత అనుకూలంగా మారే అవకాశం ఉందని కేంద్రానికి సమాచారం వెళ్లడంతో ఆయనను కూడా తాత్కాలికంగా పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఇటు ఎమ్మెల్సీ మాధవ్, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్ ఈ ఐదుగురిలో ఎవరినో ఒకరిని బీజేపీ అధ్యక్షుడిగా ఖరారు చేయడానికి పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈలోపు ఎవరి ప్రయత్నాలు వారు కొనగిస్తుంటారు.