చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచంలో అన్ని రంగాలను డేంజర్ జోన్ లో పడేసింది. దేశ ఆర్థిక వ్యవస్థల తో పాటు మనిషి జీవితాలను తల్లకిందులు చేసిన ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థను కూడా సర్వ నాశనం చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుండే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్ ఈ మహమ్మారి వల్ల ప్రశ్నార్థకంగా మారింది.
కరోనా వైరస్ ప్రపంచం లోకి ఎంటర్ కావటంతో చాలా దేశాలు, సామూహిక ప్రదేశాలను క్లోజ్ చేయటంతో విద్యా వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా అంతటా మూతపడిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇటువంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి కరోనా మహమ్మారి ప్రభావం విద్యా వ్యవస్థ పై తీవ్రస్థాయిలో పడినట్లు పేర్కొంది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల మంది విద్యార్థుల చదువులకు బ్రేక్ పడిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
ఇటీవల ఎడ్యుకేషన్ అండ్ కోవిడ్ 19 అనే టాపిక్ పై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ నిర్వహించిన వీడియో సందేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జూలైలో సుమారు 160 దేశాల్లో పాఠశాలలను బందు చేసినట్లు… ఈ పరిణామంతో వందల కోట్ల మంది విద్యార్థులు చదువులకు దూరం అయినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా నాలుగు కోట్ల మంది విద్యార్థులు అత్యంత కీలకమైన ప్రీస్కూల్ విద్యా సంవత్సరానికి కూడా కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు.