దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ముద్ర వేరు. సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా, జాతీయ రాజకీయ రాజకీయల్లో చక్రం తిప్పిన వ్యక్తిగా, అపర చాణక్యుడిగా పేరు గడించారు. దేశవ్యాప్తంగా ఆయనకు మిత్రులు, శత్రువులు ఉన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ, ఉద్వేగం, ఆశ నిరాశలు సంగ్రహణం అంతా ఈ 48 గంటల్లో తేలిపోనుంది. చంద్రబాబు విసిరిన 48 గంటల్లో ఇప్పటికే 20 గంటలు గడచిపోయాయి. గడువు పూర్తయ్యాక ఆయన ఏం చేయనున్నారు.. ఏ అడుగులు వేయనున్నారో అనే చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
చంద్రబాబు రాజకీయ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మూడు రాజధానులను పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఆయన అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నారు. బాబు రాజీనామా చేసి అమరావతి నినాదంతో గెలవాలని అధికార పార్టీ నాయకులు ముప్పేట దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజీనామాలు చేస్తారా.. జిల్లాలవారీగా ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిస్తారా అనేది పార్టీ వర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో చర్చకు దారి తీస్తోంది.
జాతీయస్థాయిలో చర్చకు దారి తీసే వ్యూహం..
అమరావతి విషయంలో సీఎం జగన్ నిర్ణయాలకు బ్రేకులు పడాలన్నా.. మూడు రాజధానుల అంశానికి ఫుల్ స్టాప్ పడాలన్నా కేంద్రం కల్పించుకోవాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది బాబు ఒక్కడి వల్ల అయ్యేది కాదు. అందుకే జాతీయస్థాయిలో అమరావతిపై చర్చకు తెర తీయాలనేది బాబు ఆలోచనగా తెలుస్తోంది. అప్పుడే కేంద్రం దృష్టికి తీసుకెళ్లగలమని భావిస్తున్నారట. రాష్ట్ర విభజన సమయంలో పరోక్షంగా.. ఇప్పుడు అమరావతి అంశంలో ప్రత్యక్షంగా బీజేపీ అన్యాయం చేస్తోందనే విషయాన్ని చంద్రబాబు జాతీయస్థాయిలో తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీని ద్వారా జాతీయస్థాయిలో బీజేపీని, రాష్ట్రంలో వైసీపీని దోషులు చేయాలనేది బాబు ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఓ రాష్ట్ర అంతర్గత అంశంపై ఇతర రాష్ట్రాలు కల్పించుకుంటాయా అనేదే ప్రశ్న.