ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపికి సిఎం కంటే సిఈవో అని పిలిపించుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతారనేది ఆయన వ్యవహార శైలి తెలిసిన వారందరికీ సుపరిచితమే. అయితే అలాంటి చంద్రబాబు ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే ఇప్పుడు ఆయన సిఈవో చంద్రబాబు అనే కంటే సంక్షేమ చంద్రబాబు అని పిలిపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు స్పష్టమైపోతోంది. మరి చంద్రబాబులో ఈ మార్పు ఎందుకు వచ్చింది?…ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత కష్టమేమీ కాదు. 2019 సార్వత్రిక ఎన్నికలు అత్యంత చేరువైన ఈ తరుణంలో ఇలా ప్రజాకర్షక సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేయడం ద్వారా వివిధ వర్గాల ఓట్లు కొల్లగొట్టేందుకే చంద్రబాబు ఈ బాట పట్టారనేది సుస్పష్టం.
అయితే ఒక రాజకీయ పార్టీ అందునా అధికార పార్టీ అధినేతగా ఆ ప్రయత్నాన్ని తప్పుబట్టలేం. అయితే తన పాలసీకి విరుద్దంగా చంద్రబాబు పెద్ద ఎత్తున చేపట్టిన ఈ సంక్షేమ పథకాలు ఆయన ఏ ఉద్దేశ్యంతో అయితే వీటి అమలుకు పూనుకున్నారో ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తాయా?…అనేదే అటు స్వపక్షం ఇటు ప్రతి పక్షం అత్యంత ఆసక్తిగా పరిశీలిస్తున్న అంశం. గతంలో సంక్షేమ పథకాలంటే ఏ మాత్రం గిట్టని చంద్రబాబు ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ది మంత్రాన్ని మాత్రమే జపించిన ఆయనే…ఇప్పుడు ఇలా ఎడాపెడా సంక్షేమ పథకాలను ప్రకటించడంపై సొంత పార్టీ వారే ఆశ్చర్యపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబులో ఈ మార్పు రావడానికి కారణం సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించి పెడతాయని…తద్వారా అధికారాన్ని మరోసారి హస్తగతం చేసుకోవచ్చనే భావనే కారణం కావచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి తెలంగాణా ఎన్నికల్లో కెసిఆర్ మళ్లీ విజయం సాధించడమే అందుకు నిదర్శనమని చంద్రబాబు విశ్వసిస్తున్నట్లు ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మొదటివి అయిన గత ఎన్నికల సమయంలోనూ తన సహజ శైలికి భిన్నంగా అనేక వాగ్ధానాలు, సంక్షేమ పథకాలు ప్రకటించి గెలుపు బాట పట్టిన చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో సైతం తాను విజయం సాధించాలంటే సంక్షేమ పథకాల వల్లే సాధ్యపడుతుందని నమ్మి వరుసగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.
ఆ క్రమంలో మొదటగా ఫించన్ల పెంపును చంద్రబాబు ప్రకటించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇలా వీరందరికి పెన్షన్లను రెట్టింపు చేస్తూ వరాలిచ్చేశారు. అయితే చంద్రబాబు ఈ ప్రకటనతో ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఖంగుతింది. కారణం ఆ పార్టీ అధినేత జగన్ తన పాదయాత్ర సందర్భంగా నవరత్నాలంటూ వివిధ సంక్షేమ ప్రథకాలను ప్రకటించగా వాటికి ప్రజల నుంచి మంచి స్పందన లభించి ఆ పార్టీకి చక్కటి మైలేజీని సైతం సాధించిపెట్టాయి. ఆ నవరత్నాల్లో ఒక ప్రధాన పథకం ఈ ఫించన్ల పెంపు కావడమే ప్రతిపక్షం ఖంగు తినడానికి కారణం. అయితే ఈ నవరత్నాలు ప్రకటించిన సందర్భంలో జగన్ తాను ప్రకటిస్తున్న ఈ పథకాలను చంద్రబాబు అమలు చేసినా ఆశ్చర్యం లేదని, అంతకంటే ఎక్కువే ఇస్తామని కూడా అంటారని… అయితే ఆ మాటలు నమ్మవద్దని కూడా జగన్ ఆ సందర్భంలోనే చెప్పుకొచ్చారు.
అయితే ప్రతిపక్ష నేత జగన్ ఊహించిన విధంగానే సిఎం చంద్రబాబు ఫించన్ల పెంపు ప్రకటించడంతో పాటు మహిళలకు పసుపు-కుంకుమ పథకం, డ్వాక్రా మహిళలకు పదివేల నగదు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ వంటివి ప్రకటించారు. అంతేకాదు మరోవైపు ప్రస్తుతం తమ బద్ద శత్రువుగా పరిగణిస్తున్న ప్రధాని మోడీ రైతు బంధు వంటి పథకం అమలులోకి తెస్తుండటంతో రైతులకు అంతకు మించిన సాయం అందించే పథకానికి రూపకల్పన చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ తన రికార్డు స్థాయి సుదీర్ఘ పాదయాత్రతో మైలేజీ దక్కించుకోవటం, ఆ పాదయాత్రలో జగన్ కు లభించిన ప్రజా స్పందనను బట్టి అతడి ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని, పైగా మరికొంత బలోపేతం అయిన ఛాయలు కనిపించడంతో చంద్రబాబు అప్రమప్తమైనట్లు కనిపిస్తోంది. పైగా జాతీయ స్థాయి సంస్థల సర్వేల్లోనూ తమకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా ఫలితాలు రానున్నట్లు నివేదిస్తుండటంతో చంద్రబాబు ఆత్మరక్షణ ధోరణి తలెత్తి ఉండొచ్చని…ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా కర్షక పథకాలే తనకు ఆవశ్యమని చంద్రబాబు నిర్ణయించుకొని ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
అయితే సంక్షేమ పథకాలతో టిడిపి పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఇక్కడ తప్పకుండా ప్రస్తావించాల్సి వుంది. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో 2.రూ బియ్యం అనే పథకం అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. సంక్షేమ పథకాలకు మూలవిరాట్ లాంటి పథకానికి తెలుగు ప్రజల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. అలాంటి టిడిపి పార్టీ నుంచి సంక్షేమ పథకాల రూపకల్పన అనూహ్యమేమీ కాకపోయినా…ఆ పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చిన అనంతరం ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందనేది వాస్తవం. తాను సిఎం పీఠాన్ని అధిరోహించిన తొలి దఫాలో చంద్రబాబు హైటెక్ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ పథకాలను అటకెక్కించడానికే ఇష్టపడిన విషయమూ వాస్తవమే.
మరి అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఇలా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేయడమే కాదు…తాము హామీ ఇచ్చినవి…ఇవ్వనివి…అలాగే వివిధ వర్గాలు అడిగినవి…అడగనివి…ఇలా అన్నీ ప్రకటించేసి…వాటిలో అనేకం వీలైనంత త్వరగా ఆచరణలోకి తేవడం ద్వారా మళ్లీ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు ఆశపడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకు నిదర్శనమే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు.”ఇన్నేళ్లు తాను రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని…రానున్న 75 రోజులు ప్రజలంతా నాకు అండగా నిలవాలి. నాకు కేంద్రం సహకరించి ఉంటే రాష్ట్రం లో ఇంకా ఎన్నో అద్భుతాలు చేసే వాడిని”…అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబు కోరుకున్నట్లు ఈ సంక్షేమ పథకాలు ఆయనకు మళ్లీ అధికారాన్ని సాధించి పెడతాయా? లేదా?…అనేది తేలాలంటే మరి కొద్ది నెలలు వేచి చూడక తప్పదు.