న్యూఢిల్లీ, ఫిబ్రవరి3: సిబిఐ కొత్త డైరక్టర్గా రిషి కుమార్ శుక్లా ఎంపికను హైపవర్ కమిటీ సభ్యుడు మల్లిఖార్జున ఖర్గే వ్యతిరేకించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఆ త్రిసభ్య కమిటీలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కూడా సభ్యుడు. నిన్న ఈ కమిటీ సమావేశమై శుక్లాను ఎంపిక చేసింది.
దానిని వ్యతిరేకించిన ఖర్గే తర్వాత తన అసమ్మతిని తెలియజేస్తూ ప్రధానికి లేఖ కూడా రాశారు. దానిని ఖండిస్తూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ నేడు ఫేస్బుక్లో ఒక బ్లాగ్పోస్టు పెట్టారు. ప్రస్తుతం జైట్లీ వైద్యచికిత్స కోసం అమెరికాలో ఉన్నారు.
‘ఖర్గే క్రమం తప్పకుండా అసమ్మతి తెలుపుతారు. సిబిఐ డైరక్టర్గా అలోక్ వర్మను ఎంపిక చేసినపుడు అసమ్మతి తెలిపారు. అలోక్ వర్మను బదిలీ చేసినపుడు అసమ్మతి తెలిపారు. ఇప్పుడు శుక్లాను ఎంపిక చేస్తే అసమ్మతి అంటున్నారు’, అని జైట్లీ వ్యాఖ్యానించారు.
ఖర్గే అసమ్మతి అనే ఆయుధం విలువ తగ్గిస్తున్నారని జైట్లీ పేర్కొన్నారు. అసమ్మతిని ఎప్పటికీ రాజకీయ ఆయుధంగా వాడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఖర్గేకు దురుద్దేశాలు ఉన్నాయనీ, ఆ కారణంగా ఆయన సిబిఐ డైరక్టర్ పదవి ఎంపిక ప్రక్రియ మొత్తం రాజకీయ యుద్ధంగా కనబడేట్లు చేస్తున్నారని జైట్లీ ఆరోపించారు.