(ఒంగోలు నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసినందున గుర్తు తెలియని వ్యక్తులు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారనీ, తనకు రక్షణ కల్పించాలనీ న్యాయవాది శ్రీనివాస స్వామి రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లా ఎస్పికి వినతి పత్రం సమర్పించారు.
తాను గతంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు తదితరులు రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలుకు సంబంధించి ఆధారాలను సేకరించి ఏసిబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆ ఫిర్యాదు అధారంగా దమ్మాలపాటి శ్రీనివాసరావు, ఇతరులపై కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు కొద్ది రోజులుగా చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ , మెజేస్లు వస్తున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు తనను నిత్యం ఫాలో అవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు స్వామి రెడ్డి. అంతే కాకుండా తన గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ఆరా తీస్తూ తన ఇంటి పరిసరాల్లో తిరుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి తనకు రక్షణ కల్పించాలని స్వామి రెడ్డి ఎస్పిని కోరారు.