తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరేం అనుకున్నా, తనకు నచ్చింది చేసుకుంటూ పోతారనే సంగతి తెలిసిందే. ప్రతిఘటన ఎదురైతే రెట్టించిన ఉత్సాహంతో సాగడం ఆయన విధానం.
వివాదంగా మారిన అంశాల్లో ధైర్యంతో ముందుకు సాగడం ఆయన నైజం. అలాంటి వాటిల్లో సెక్రటేరియట్ నిర్మాణం ఒకటి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయం నిర్మాణానికి కేసీఆర్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ పర్వంలో తాజాగా నిర్మాణానికి అంతా ఓకే చేసేశారు.
కొత్త సెక్రటేరియట్ కోసం…
కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా మనం ఇంకా వలస మరకలతోనే బతకాలా? కొత్త రాష్ట్రంగా కొత్త ప్రయాణాన్ని ఆరంభించిన తెలంగాణ కొత్తగా ఉండాలని కోరుకోవడంలో, కొత్త సచివాలయాన్ని కట్టుకోవడంలో తప్పేమిటి? కొత్త సంసారం ఆరంభించిన ప్రతి జంటా, తనదైన కొత్తింటి నిర్మాణం కోసం పరితపిస్తున్న ఈ రోజుల్లో, కోట్లాది ప్రజల గౌరవ సూచకంగా చక్కటి సచివాలయం ఎందుకు ఉండకూడదు? అంటూ ఆసక్తికరమైన వాదన వినిపిస్తూ, ఇతరత్రా సాంకేతిక అంశాలను పేర్కొంటూ కొత్త సెక్రటేరియట్కు తెలంగాణ సర్కారు సిద్ధమైంది.
అన్నీ పాతవే..అతుకుల బొంత
సచివాలయంలో ఇప్పుడున్న భవనాలు ఒక్కొక్కటి ఒక్కోసారి కట్టినవి. ఒకటి పాతదైందని కూల్చి కొత్తది కట్టేసరికి మరొకటి పాతదవుతుంది. ఈ అతుకుల బొంత సంసారం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఎన్నటికైనా కొత్త సచివాలయం కట్టుకోక తప్పదు. ఇప్పుడు కట్టుకునే అవసరమున్నది. అవకాశమూ ఉంది అని పేర్కొంటూ పాత సచివాలయం స్థానంలో కొత్తది నిర్మాణానికి సిద్ధమయ్యారు. అయితే, దీనిపై హైకోర్టులో కేసులు పడ్డాయి. ఈ సమయంలో, సచివాలయ భవనాలు కూల్చి కొత్త భవనం కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంలో తప్పేమీ లేదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది.
దసరా నుంచి మొదలు
సెక్రటేరియెట్ నిర్మాణానికి అన్ని అనుమతులు రావడం, దసరా నుంచే కొత్త సెక్రటేరియెట్ పనులు ప్రారంభిస్తున్న తరుణంలో టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న కొత్త సెక్రటేరియెట్ ను కట్టేందుకు ఆరు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ కంపెనీలతో ఆర్ & బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ప్రీ బిడ్డింగ్ మీటింగ్ నిర్వహించారు. టాటా, షాపూర్ జీ పల్లోంజీ, జేఎంసీ ప్రాజెక్ట్స్, ఎల్ &టీ, ఎన్ సీసీ, కేపీసీ ప్రాజెక్ట్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సెక్రటేరియెట్ టెండర్ కు సంబంధించిన అంశాలు, నిర్మాణం, నిధుల చెల్లింపు వంటి అంశాలపై కంపెనీల డౌట్లను నివృత్తి చేయటం కోసం ఈ మీటింగ్ పెట్టినట్లు ఈఎన్సీ గణపతి రెడ్డి తెలిపారు. ఈ నెల13న టెక్నికల్ బిడ్ ను, 16న ఫైనల్ బిడ్ ను ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారు. రూ.617 కోట్ల అంచనా వ్యయంతో సెక్రటేరియెట్ను నిర్మిస్తున్నామన్నారు.12 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని , కట్టడం పూర్తయ్యే వరకు ఎలాంటి అడ్వాన్స్ చెల్లింపులు ఉండవని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా కాలంలో ఆర్థికంగా రాబడి లేదని పేర్కొంటూనే ఇంత భారీ ఖర్చకు సిద్ధపడటం కేసీఆర్ దైర్యానికి నిదర్శనమని కొందరు అంటుంటే…. భారీ ఖర్చు చేస్తున్నారంటూ ఇంకొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.