వహ్వా ఎన్నికలంటే..! ముందు పథకాలు.., పరిహారాలు.., సంక్షేమాల పేరిట పైసల గుమ్మరింపు చూస్తూనే ఉంటాం..!! ఆ డబ్బు తడిలో ఓటర్లు తడిసిపోయి.., ఓటు గుద్దెయ్యాలనేది నేతల ఆశ. అందుకే ఏనాడూ లేనట్టుగా హైదరాబాద్ లో వరద సాయాన్ని కేసీఆర్ రూ. 10 వేలకు పెంచారు. కొన్ని ఇళ్లకు రూ. లక్ష వరకు ఇస్తామన్నారు. ఇంకేం వరద తడులను.., ఈ డబ్బు తడి కాస్త కవర్ చేస్తుంది అనుకున్నారు. కానీ గ్రేటర్ లో టీఆరెస్ నేతలు చేసిన పనికి కేసీఆర్, కేటీఆర్ బాగా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు.
రూ. వందల కోట్లు మింగేశారు..!!
గ్రేటర్ లో వరద సాయంగా రూ. 320 కోట్లు వరకు ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 4 లక్షల కుటుంబాలకు రూ. 10 వేలు చొప్పున ఇస్తామన్నారు. ఇది కేటీఆర్, కేసీఆర్ ఇచ్చిన హామీ. మంచి సాయమే అనుకుంటూ గ్రేటర్ జనం కూడా సంతోషించారు. అయితే దీన్ని పంపిణీలో టీఆరెస్ నాయకుల చేతివాటం బాగా ప్రదర్శించారు. రూ. 320 కోట్లలో కనీసం రూ. 150 కోట్లు కూడా అర్హులకు చేరనీయలేదట. ఎక్కడికక్కడ నొక్కేసి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రూ. 10 వేలు ఇవ్వాల్సిన ఇంటికి రూ. 5 వేలు.., అక్కడక్కడా రూ. 3 వేలు మాత్రమే ఇచ్చారట. ఇలా మొత్తానికి రెండు లక్షల కుటుంబాలకు మాత్రమే రూ. 5 వేలకు మించి ఇవ్వలేదట. ఇలా వరద సాయాన్ని నేతలు దోపిడీకి పాల్పడ్డారని హైదరాబాద్ నగరం మొత్తం పాకేసింది. ఆరోపణలు, ప్రచారాలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.
గ్రేటర్ ఎన్నికల కోసం ఏర్పాట్లు..!!
గ్రేటర్ లో వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఒక్కో అభ్యర్థి కనీసం రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఎలాగూ ఎలచ్చన్లలో పంచాలి.., ఆ ఖర్చు ఇలా రాబెట్టేసుకుందాం అనే ప్లాన్ వేసుకుని చాల వరకు పక్కదారి పట్టించారట. అక్కడితో ఆగకుండా.. ఇంకొందరు ఎలక్షన్ లో సీటు ఇస్తారో, ఇవ్వరో ఇదే దొరికింది అవకాశం అంటూ గట్టిగా వెనకేసుకున్నారట. ఈ మాటలు, కొన్ని ఆడియో సంభాషణలు, కొన్ని ఆరోపణలు హైదరాబాద్ మొత్తం పాకిపోయాయి. ఇలా గ్రేటర్ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని గుల్లల్ల టీఆరెస్ నాయకులు వ్యవహరించిన తీరు కేటీఆర్, కేసీఆర్ లకు విస్మయానికి గురి చేసిందని సమాచారం.
సాయం పంపిణీ ఆపేసి.. అంతర్గత నివేదికలు..!!
ఇక పిర్యాదులు ఎక్కువగా వస్తుండడం.., జనం నుండి తిరుగువుబాటు, గొగ్గోలు వస్తుండడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. నిన్న ఉదయం నుండి సాయం పంపిణీ ఆపేసింది. సీఎం కేసీఆర్ ఈ విషయంపై సీరియస్ గా స్పందించి ఇంటెలిజెన్స్ నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశించారట. కేటీఆర్ కూడా వెంటనే గ్రేట్ అధికారులతో సమీక్షించి, ఈ పరిహారం పంపిణీ తీరుపై నివేదికలు తెప్పించుకున్నారు. వీటిని చూసి షాక్ తిన్నారు. మొత్తానికి ఎన్నికల సమయంలో.., పార్టీలో ఇలా కక్కుర్తి వ్యవహారాలు బయటకు రావడంతో హైదరాబాద్ లో టీఆరెస్ నేతలకు కొత్త కష్టాలు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇది తిరగదోడితే ఎన్నికల్లో ఏ మాత్రం తేడా వచ్చినా రాజకీయంగా కష్టమేనని కొందరు అనుకుంటున్నారట.