అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్ష ఫీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా నెలకొని ఉంది. ఇప్పటికే మాజిక్ ఫిగర్కి చేరువలోకి వచ్చిన డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడన్ విజయం ఖాయమని ఆయన ప్రచార వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మరో పక్క అమెరికా దేశ వ్యాప్తంగా ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అయిదు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో రీకౌంటింగ్ జరపాలంటూ ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకూ జో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. జోబైడెన్ 264 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి మాజిక్ ఫిగర్కు ఆరు ఓట్ల దూరంలో ఉండగా, అధ్యక్షుడు ట్రంప్నకు 214 ఓట్లు మాత్రమే లభించాయి. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, నెవెడా, అలస్కా రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కీలకంగా మారిన ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ట్రంప్, బైడన్ భవితవ్యాలను తేల్చనున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల్లోనూ ట్రంప్ ఆధిక్యం కొనసాగితేనే ఆయనకు విజయావకాశాలు ఉంటాయంటున్నారు. ఆరు ఓట్లు ఉన్న ఒక్క నెవెడాలో ఆధిక్యత కనబరిస్తే జో బైడెన్ మాజిక్ ఫిగర్ కు చేరుకుంటారు. నెవెడాలో బైడెన్ ఆధిక్యత కొనసాగుతోంది.
16 ఓట్లు ఉన్న జార్జియాలో ఓట్ల లెక్కింపు హోరాహోరీగా నడుస్తున్నది. ఇక్కడ ఓట్ల లెక్కింపులో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ట్రంప్ ఆధిక్యత సాదిస్తే 230 ఓట్లకు చేరుకుంటారు. అదే విధంగా పెన్సిల్వేనియా, నార్త్ కరోలినాలో ట్రంప్ ఆధిక్యత కొనసాగుతోంది. అమెరికాలో కౌంటింగ్ ప్రారంభం అయి రెండు రోజులు గడుస్తున్నా ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాల వెల్లడిలో తీవ్ర ఆలస్యం అవుతోంది.