‘జర్నలిజం అంటే నోరేసుకు పడిపోవడం కాదు.. బ్రెయిన్ వేసుకుని పడిపోవడం’ అని బ్రహ్మానందం కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో అంటాడు. ఇక్కడ బ్రెయిన్ తోపాటు నోరేసుకుని కూడా పడిపోతూంటాడు ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి. చానెలో లో డిబేట్ పెట్టాడంటే విరుచుకుపడిపోయే అర్ణబ్.. అదే విధంగా వివాదాలూ కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ప్రజా ప్రయోజనాలు కంటే రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం పనిచేయడమే నేటి జర్నలిజం. అర్నబ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆయన వాదనలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. బీజేపీ అంటే గిట్టని శివసేనకు అర్నబ్ బద్ద వ్యతిరేకి అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఇటివలి అర్నబ్ అరెస్టు, బెయిల్ సంఘటలు జరిగాయి. అయితే.. అర్నబ్ ను ఇంకా ఇరికించే ప్రయత్నాల్లో శివసేన ఉన్నట్టు తెలుస్తోంది.
శివసేన అంత తేలిగ్గా వదులుతుందా..?
తనకు నచ్చకపోతే ఎవరిపైనైనా కఠినంగానే వ్యవహరిస్తుంది శివసేన. ఈ నేపథ్యంలోనే శివసేన పార్టీకి, సీఎం ఉద్దవ్ ఠాక్రేకు, మహారాష్ట్ర పోలీసులకు కూడా అర్నబ్ టార్గెట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే రెండేళ్లనాటి కేసును తవ్వి ఇటివల అర్నబ్ ను అరెస్ట్ చేశారు. ఉత్కంఠ పరిస్థితుల మధ్య అర్నబ్ కు బెయిల్ వచ్చింది. పాత కేసులు వెలికితీసి అర్నబ్ ను మళ్లీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అనే సామెతలా.. ప్రభుత్వాలు తలచుకుంటే కానిదేముంది. అర్నబ్ విషయంలో గతంలో ఫిర్యాదు దశలోనే ఆగిపోయిన కేసులను తవ్వి తీస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే శివసేన నిరంకుశత్వం పరాకాష్టకు చేరినట్టే.
బీజేపీ సాయం కొంతవరకే..
అయితే.. అర్నబ్ ధైర్యానికి బీజేపీ ఊపిరిలూదుతూ ఉంటుంది. కానీ.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పరిధిలో జరిగే విషయాల్లో అయితే అర్నబ్ కు రక్షణ కల్పించగలదు కానీ.. రాష్ట్రాల పరిధిలో తీసుకునే నిర్ణయాల్లో వేలు పెట్టలేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పై కూడా శివసేన వ్యవహరించిన తీరు తెలిసిందే. ఆ సమయంలో ఆమెకు వై కేటగిరీ కల్పించిన కేంద్రం.. అంతకుమించి ఆమె విషయంలో పట్టించుకోలేదు. ఇప్పుడు కంగనా కూడా ఉద్దవ్ ఠాక్రేకు టార్గెట్టే. కారణం.. శివసేన ప్రభుత్వాన్ని ఇటివల కంగనా ఓ ఆట ఆడుకుంది. ఈ నేపథ్యంలో శివసేన అటు కంగనా, ఇటు అర్నబ్ ను అంత తేలిగ్గా విడిచిపెట్టదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.