గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్(GHMC) ఎన్నికలకు పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. ఉదయం 9 గంటల వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 4.2 గా నమోదయ్యింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయినా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. ఈసారి ఓటింగ్ శాతం 50 శాతానికి చేరుకునేలా చర్యలు చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఒకవైపు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే ఓటింగ్ శాతం పెరిగేలా చూస్తున్నామని అధికారులు వెల్లడించారు. పోలింగ్ ప్రారంభమైన తక్కువ సమయంలోనే చాలా మంది ప్రముఖులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కానీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నగరవాసులు మాత్రం కరోనాకి భయపడి ఓటు వేయడానికి బయటకు రావడం లేదు. అలాగే పాతబస్తీలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా నమోదయ్యింది. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఇంకా ముందుకురావడం లేదు.