తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేకెత్తించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలు కొత్త చర్చను తెరమీదకు తెస్తున్నాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో బీజేపీకి బాగా బలపడింది.
2016లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, బీజేపీ 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 సీట్లలో గెలుపొందగా తాజా ఎన్నికల్లో దానికి భిన్నంగా టీఆర్ఎస్ ఇప్పుడు 55 సీట్లకే పరిమితం కాగా, గణనీయంగా పుంజుకున్న బీజేపీ 48 సీట్లు సాధించింది. ఎంఐఎం ఎప్పటిలాగే తన సీట్లను నిలబెట్టుకోగా, కాంగ్రెస్2 చోట్ల గెలిచి తన ఉనికిని కాపాడుకుంది. అయితే, ఈ సీట్ల తగ్గింపు తెలంగాణ సీఎం కేసీఆర్పై `పూర్తి వ్యతిరేకత` అనుకోనవసరం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దుబ్బాకతో మొదలు…
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అనూహ్య విజయం సాధించిన తర్వాత బీజేపీలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. అదే ఇప్పుడు ఆ పార్టీని గ్రేటర్లో ముందుకు నడిపించింది. దానికి ఆ పార్టీ నేతల పక్కా ప్రణాళిక తోడైంది. జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్ అయినా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు హైదరాబాద్కు వచ్చారు. ఒక ప్రముఖ లీడర్ తర్వాత మరో ప్రముఖ లీడర్ వెంటవెంటనే రాష్ట్రానికి వచ్చారు. తద్వారా జనాల ఫోకస్ను బీజేపీ వైపు మరల్చారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో పార్టీలో జవాబుదారీతనం పెరిగింది. శ్రమించాలనే భావన కలిగింది.
కేసీఆర్ వ్యతిరేకత … కాదా?
గ్రేటర్ ఫలితాలు పూర్తిగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకతగా భావించక్కర్లేదని పలువురు చెప్పుకొస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. అయితే అది ఇంకా తీవ్రమైన స్థాయికి చేరలేదు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పాలన కొనసాగుతోంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు సంవత్సరాల సమయం ఉంది. ఎక్కువ సమయం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను ఓటర్లు అంత త్వరగా రిజెక్ట్ చేయరు. ఉన్న సమయంలో ఆ పార్టీ , ప్రభుత్వం ఎలా పని చేస్తుందో విశ్లేషించుకుంటారు. అయితే, ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరినట్లయితే ఆ ప్రభుత్వం ప్రమాదంలో పడినట్లే. అలా పడకుండా చూసుకోవడం పూర్తిగా టీఆర్ఎస్ బాధ్యతే.