సీఎం జగన్ కి పాతికేళ్ళు సీఎంగా ఉండాలనే ఒక సుదీర్ఘ లక్ష్యం ఉంది. జగన్ అంటే “మాట తప్పుడు- మడమ తిప్పడు” అనే ఒక బ్రాండ్ ఉంది. జగన్ అంటే ఒక ప్రత్యేక చూపు ఉంది. జగన్ పై ఏపీకి ఒక పెద్ద నమ్మకం ఉంది..! అందుకే ఆయన కూడా ఊహించలేని సంచలనమైన గెలుపు అందింది..! కానీ జగన్ దాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నారు. రాజకీయంలో ఎలా ఉన్నా.., పరిపాలనలో అపరిపక్వ నిర్ణయాలతో.., రాజకీయ- పరిపాలనతో తన పేరుపై తానే మచ్చలు వేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. ఈ యూ టర్న్ లు చూసుకుంటే.., జగన్ లో ఉన్న కన్ఫ్యూషన్ తెలుస్తుంది..!
బీజేపీ ట్రాప్ లో పడి తప్పు చేశారా..!?
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనను ఇరకాటంలోకి నెట్టాయి. సెప్టెంబర్ లో ఈ బిల్లుల ఆమోదానికి వైసీపీ కూడా ముఖ్య కారణం. పార్లమెంటులో బీజేపీ బలంతో గట్టెక్కిన ఈ బిల్లులకు రాజ్యసభలో వైసీపీ ఆపద్భాంధవుడిగా నిలిచింది. అకాలీదళ్ శిరోమణి హ్యాండ్ ఇచ్చిన వేళా ఆ బాధ్యతని జగన్ భుజాన వేసుకుని.., బీజేపీకి మద్దతిచ్చారు. ఈ బిళ్లలను బేషరతుగా, నిస్సంకోచంగా, నిస్సందేహంగా ఆమోదించారు. అనుకూలంగా ఓటేశారు. విజయసాయిరెడ్డి రెండు అడుగులు ముందుకేసి బిల్లుని పొగుడుతూ.. బీజేపీని, మోడీని ఆకాశానికెత్తేశారు. నాడు బీజేపీతో అవసరాల దృష్ట్యా.., బీజేపీతో పని దృష్ట్యా అలా వారి ట్రాప్ లో పడ్డారు. పోనీ పడితే పడ్డారు.., అది రాజకీయం..!
* అదే బిల్లులపై ఇప్పుడు దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈరోజు భారత్ బంద్ జరుగుతుంది. దీనికి కూడా వైసీపీ మద్దతు ప్రకటించింది. నాడు బిల్లులకు మద్దతిచ్చిన వారే.., నేడు ఆ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్నా పోరాటానికి మద్దతివ్వడం అంటే.. దేశం నవ్వుకోదా..? జగన్ తీరు గమనించదా…? అసలు జగన్ మదిలో ఏముందో..? నాడు ఎందుకు మద్దతిచ్చారో..? కానీ నేడు సైలెంట్ గా ఉండాల్సింది. న్యూట్రల్ గా నిలబడాల్సింది. అప్పుడు ఏ చర్చ జరిగేది కాదు. కానీ ఇప్పుడు బందుకు మద్దతివ్వడం ద్వారా జగన్ లోని యూ టర్న్ బయటకు వచ్చినట్టే.
మండలిపై చేసిందేంటి..!?
అదిగో శాసనమండలి రద్దు అంటూ శాసనసభలో బిల్లు ఆమోదించేసారు. ఎమ్మెల్సీలు గా ఉంటూ మంత్రులైన ఇద్దర్నీ రాజీనామా చేయించేశారు. వారికి రాజ్యసభ ఇచ్చేసారు. కానీ మండలి రద్దు కాలేదు. మళ్ళీ కొందరికి ఎమ్మెల్సీలుగా కొత్త అవకాశాలు ఇస్తున్నారు. పాపం శాసనమండలి రాజకీయంలో ఇద్దరు మంత్రులు బలయ్యారు. కానీ జగన్ నాడే కాస్త లోతుగా అలోచించి ఉంటె.. ఏడాది ఆగి ఉంటె పని జరిగేది. మరో ఆరునెలల్లో మండలిలో టీడీపీ బలం 15 తగ్గి, వైసీపీ బలం 26 కి పెరుగుతుంది. అంటే అక్కడా ఇక వైసీపీ ఆట మొదలవుతుంది. ఈ చిన్న లాజిక్కు, లోతు తెలుసుకోలేని జగన్ ఆ విషయంలో తప్పిదం చేసారు. ఇప్పుడిప్పుడే మనసు మార్చుకుంటున్నారు. ఇలా ఈ రెండు విషయాల్లో జగన్ చేసిన తప్పులు, మాట మార్చడాలు.. వైసీపీని ఇరకాటంలో పెట్టడం ఖాయమే..!