ఏదైనా చేయాలనే తపన ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యం దిశగా అడుగులు వేస్తే.. విజయం మన సొంతం అవుతుంది అనడంలో సందేహం లేదు. దీన్ని ఎంతో మంది నిరుపించారు. దీనికి వయసు, లింగ భేదాలు ఉండవు. అచ్చం ఇలాంటి ఘటనే గుజరాత్ లో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన 62 యేండ్ల ఒక మహిళ. పాల వ్యాపారాన్ని ప్రారంభించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. వ్యాపారం అంటే మాటాల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ.. ఔరా అనిపించింది.
గుజరాత్లో బనస్కాంత జిల్లాలోని నాగానా గ్రామానికి చెందిన చౌదరి నవల్బెన్ దల్సంగ్బాయ్(62) ఏడాదిలో అక్షరాల రూ. 1కోటి 10లక్షల విలువైన పాలను విక్రయించింది. దాంతో గుజరాత్లో కొత్త రికార్డును నెలకొల్పింది. అయితే ఈ మహిళ నిరక్షరాస్యురాలు. ఈ మహిళ దగ్గర 80 గేదెలు, 45 ఆవులు ఉన్నాయి. వీటితో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కలిపి అటు ఇటుగా వెయ్యి లీటర్ల పాలను ఆమె అమ్ముతుంది. రెండేళ్లలో నవల్బెన్కు బనస్కాంత జిల్లాలో 2 లక్ష్మి అవార్డులు, 3 ఉత్తమ పశుపాలక్ అవార్డులు సైతం వచ్చాయి.
గాంధీనగర్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డులను తీసుకుంది. నవల్బెన్ డెయిరీలో 11 మంది పని చేస్తారు. పాల వ్యాపారంలో విప్లవాన్ని సృష్టిస్తున్న ఈ మహిళకు నలుగురు కొడుకులు ఉన్నారు. ఏదైనా చేయగలము అనే పట్టుంటే దేనైనా సాధించగలమని ఈ మహిళ చెబుతోంది. పెద్దపెద్ద కంపనీల్లో పని చేసే వారుకూడా ఈమె అంత సంపాధించలేరు అనడంలో సందేహం లేదు. కానీ ఈ విజయం వెనుక ఆ పట్టుదల, కృషి మాత్రం చాలా ఉందని చెప్పొచ్చు.