రాజకీయ పార్టీలకు ఎత్తుకు పైఎత్తులు వేయడం కొత్త కాదు. అలా వేయకపోతనే ఇబ్బంది. ఇటువంటి సందర్భాల్లో ఒక్కోసారి ఎదుటి పార్టీ వేసే గాలంలో చిక్కుకుని విలవిలలాడిపోతారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే జరగాల్సింది జరిగిపోతుంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇంచుమించుగా ఇదే. అధికారం కోల్పోయామనే బాధో, పార్టీ భవిష్యత్ ఏంటో అనే ఆందోళనో, సీఎం జగన్ దూకుడు చూసో కానీ టీడీపీకి ‘మతం’ రంగు అంటకునేలా చేశారు. ఇందులో చంద్రబాబు తప్పు పెద్దగా లేదు.. అంటే చిన్నగా ఉందనే చెప్పాలి. క్రిస్టియన్లపై ఆయన చేసినవి వివాదాస్పద వ్యాఖ్యలు కాకపోయినా భారీ నష్టానికి నాంది పలుకుతున్నాయి. స్వయంకృతాపరాధంతో చంద్రబాబు ఏపీలో మతం అనే తేనెతుట్టును కదిలించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
చంద్రబాబుకు భారీ ఝలక్..!
ఏపీలో ఇటివల హిందూ దేవాలయాలపై దాడులు.. దేవుళ్ల విగ్రహాల ధ్వంసం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు.. ‘ఏపీ సీఎం, హోంమంత్రి, డీజీపీ, రామతీర్ధం ఘటనపై విచారణ జరుపుతున్న అధికారి.. వీరంతా క్రిస్టియన్లే.. రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయి’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ సి థోచర్ ఇటివలే టీడీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు రాజీనామా చేశారు. వీరంతా చంద్రబాబు క్రిస్టియన్లపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఫిలిప్ సి థోచర్ అయితే.. ఏకంగా చంద్రబాబు వైఖరి అసహ్యం పుట్టిస్తోందని ఘాటు వ్యాఖ్య చేశారు. అధికారంలో ఉన్నప్పుడు శిలువ వేసుకుని తిరిగి ఇప్పుడు క్రైస్తవులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. క్రిస్టియన్ సెల్ టీడీపీ అధ్యక్షులు కూడా ఇదే కారణంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
చంద్రబాబు వివాదాస్పద వ్యఖ్యలు చేశారా..?
భారత్ లౌకికవాద దేశం. పార్టీలైనా, ప్రభుత్వాలైనా అన్ని మతాలను గౌరవించాల్సిందే. పార్టీలు అన్ని మతాల పండగలకూ శుభాకాంక్షలు చెప్పడం, ప్రభుత్వంలో ఉంటే పథకాలు ప్రకటించడం మామూలే. అయితే.. దేశంలో ఇటివల జరుగుతున్న పరిణామాలు మళ్లీ మూడు దశాబ్దాల నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. ఇందుకు బీజేపీ మతం అంశంతో బీహార్, జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లి ఫలితాలు రాబట్టింది. త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ‘తిరుపతి ప్రజలు భగవద్గీతకు ఓటేస్తారా.. బైబిల్ కు ఓటేస్తారా’ అని నిప్పు అంటించేశారు. ఈ పంథాలోనే చంద్రబాబు వెళ్లేందుకు చూసి ఇరుక్కుపోయారు. సీఎం జగన్ ను క్రిస్టియన్ గా చిత్రీకరించే క్రమంలో రామతీర్ధం ఘటన, మతమార్పిడుల అంశాన్ని లేవదీసారు. ఈ వ్యాఖ్యలు జగన్ కు చేటు చేయకపోగా ‘చంద్రబాబుకు హిందూత్వవాది..’ అని ముద్ర వేసేలా వరుస రాజీనామాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో.. ఇప్పటికే టీడీపీ సైకిల్ టైర్లకు గాలి పోయి ఉంటే.. ఇప్పుడు స్పేర్ పార్టులు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. జగన్ ను ఒక మతానికి అంటగట్టే ప్రయత్నంలో చంద్రబాబుకు మంట అంటుకుంది.
అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్ చేస్తోందిదే..!
జగన్ క్రిస్టియన్ వాదీ కాదు.. చంద్రబాబు హిందూవాది కాదు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు కూడా రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా, సంక్రాంతి కానుక.. ఇలా పథకాలు ఇచ్చినవారే. ఇప్పుడు జగన్ చేస్తున్నదీ ఇదే. కాకపోతే.. హిందూ దేవాలయాలపై దాడులే కొత్తగా జరుగుతున్నాయి. బీజేపీకి హిందూ ఓట్లు ఎక్కువ, పైగా మోదీ, షా ద్వయం కనుసన్నల్లోనే భారత్ మరో దశాబ్దం నడిచే అవకాశాలున్నాయి. బీజేపీ.. తాను ఎత్తుకున్న హిందూవాదానికి ‘మతతత్వ పార్టీ’ అనే ముద్ర ఇప్పుడు చాలా చిన్నది. పైగా.. అయోధ్య విషయంలో హిందువులకు బీజేపీ వెలుగు దివ్వెలా కనిపిస్తోంది. దీనిని చూసి చంద్రబాబు వాతలు పెట్టుకుంటే కష్టమే. అంతర్వేది రథం దగ్దం జరిగితే హైదరాబాద్ నుంచి రాని చంద్రబాబు.. రామతీర్ధం వచ్చేశారు. బీజేపీ కంటే ముందే.. హిందూవాదాన్ని వేసుకునేందుకే చంద్రబాబు వచ్చారనే ఆరోపణలూ లేకపోలేదు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై పడని ‘మతం’ ముద్రను ఫ్రస్ట్రేషన్ లో తీసుకుని చంద్రబాబు పెద్ద తప్పే చేశారని చెప్పాలి. మరి.. ఈ ఎఫెక్ట్ టీడీపీపై ఇప్పుడే పడుతుందో.. భవిష్యత్ లో పడుతుందో.. అసలు పడదో.. చూడాల్సిందే..!