గత కొద్దికాలంగా విపక్షాల ఆరోపణలకు ఏకైక కేంద్రంగా మారిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి తరుణంలో ప్రదర్శించిన సంయమనం ఆయన్ను సేఫ్ చేసిందని అంటున్నారు.
అదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన దూకుడు ఆయన్ను బుక్ చేసిందని చెప్పుకొస్తున్నారు. ఇదంతా క్రైస్తవుల కేంద్రంగా జరిగిన విమర్శల పర్వం ఎపిసోడ్ గురించి
జగన్ ను బుక్ చేయబోయి ఇరుక్కున్న చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ సమయంలో క్రైస్తవులపై పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రైస్తవుల్లోనే అసహనం వ్యక్తమైంది. తాజాగా విజయవాడలో టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఆయనతో పాటుగా టిడిపి క్రిస్టియన్ సెల్ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ , టీడీపీలో ఎంతో కాలంగా ఉండి పార్టీ కోసం పని చేస్తన్నామని తెలిపారు. చంద్రబాబు 5వ తేదీన చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని పేర్కొన్నారు. “క్రైస్తవ సమాజాన్ని అవమానించే విధంగా మాట్లాడారు. గతంలో మీరు అనేక సార్లు చర్చిలో మీరు ప్రార్ధనలు కూడా చేశారు. మసీదులకు వెళ్లి నమాజ్ చేసి శుభాకాంక్షలు చెప్పలేదా? లౌకిక దేశంలో అన్ని మతాల వారు… అన్ని పండుగలలో పాల్గొంటారు. చర్చి ఫాదర్ లకు ఐదువేల రూపాయలు ఇస్తే… తప్పు పట్టడం దేనికి? మీ మ్యానిఫెస్టోలో కూడా అనేక పధకాలు పెట్టలేదా? మత మార్పిడి విషయంలో కూడా క్రిస్టియన్ లను అవమానించారు. బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నట్లు నిరూపించాలి. గ్రామాలలో చర్చిలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలు ను నిరసిస్తూ… టిడిపి క్రిస్టియన్ సెల్ ప్రతినిధులు అంతా పార్టీ కి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం` అని ప్రకటించారు.
చంద్రబాబు సైలెంట్ ?
తన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైలెంట్ అయ్యారని , ఆయన నోట మాట రావడం లేదని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు , సభ్యులు రాజీనామా చేయడం సాక్ అని విశ్లేషిస్తున్నారు. అయితే, టీడీపీ మాత్రం మరో కౌంటర్ ఇచ్చింది. `తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రవీణ్ అనే వ్యక్తి చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదు` మద్దిరాల మ్యానీ, టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు అని ఓ ప్రకటనను పార్టీ విడుదల చేసింది.