దేశ వ్యాప్తంగా మరో మూడు రోజుల్లో కరోనా వ్యాక్సిన్ మొదటి దశ పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. దేశంలో అత్యవసర వినియోగం కింద అనుమతి పొందిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల కేంద్ర స్థానాలకు, అక్కడి నుండి జిల్లాలకు ఈ వ్యాక్సిన్ ల తరలింపు పూర్తి అయ్యింది. అయితే వీటిలో ఏదో ఒక వ్యాక్సిన్ ను ఎంచుకునే ఆప్షన్ ప్రజలకు ప్రస్తుతానికి ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అనేక దేశాలలో ఒకటి కన్నా ఎక్కువ వ్యాక్సిన్ లు సరఫరా అవుతున్నప్పటికీ ఎక్కడా ప్రజలకు ఇలాంటి ఎంపిక స్వేచ్చను ఇవ్వలేదని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ పేర్కొన్నారు.
వ్యాక్సిన్ రెండు డోసులను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తరువాతే వాటి ప్రభావం ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. అప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు కోవిడ్ నిబంధనలను కశ్చితంగా పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని రాజేష్ భూషణ్ సూచించారు.
కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ల గురించి నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ మాట్లాడుతూ ఈ రెండు వ్యాక్సిన్ లు వేల మందిపై పరీక్షించారనీ అవి సురక్షితమైనవేనని స్పష్టం చేశారు. భారతీయ వ్యాక్సిన్ లన్నీ సురక్షితమని, సమర్థవంతంగా పని చేస్తాయని, ప్రజలు వాటిని ఎటువంటి అనుమానం లేకుండా పొందవచ్చని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుండి తొలి విడత మూడు కోట్ల మంది కరోనా వారియర్స్ కి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు.