వైఎస్ జగన్మోహనరెడ్డి ys jagan mohan reddy ముఖ్యమంత్రి cm గా బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక కీలక నిర్ణయాలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తూనే మరో పక్క అభివృద్ధి వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గతంలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్న వారి జాబితాపైనా దృష్టి పెట్టారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల కేటాయింపులను రద్దు చేయడమే కాక తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో జరిగిన భూ కేటాయింపులపైనా జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ అధారిటీ (వీఎంఆర్డీయే) పరిధిలో ఓ ప్రముఖ సంస్థకు వైఎస్ఆర్ హయాంలో వేలం ద్వారా కేటాయించిన సుమారు 40 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సదరు భూములను స్వాధీనం చేసుకోవాలంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి శుక్రవారం విఎంఆర్డీయే కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే..ఎల్ అండ్ టీ విజన్ వెంచర్స్ సంస్థ కొమ్మాాది లోని 39.89 ఎకరాలను వైఎస్ఆర్ హయాంలో వేలం ద్వారా పాడుకుంది. ఎకరం రూ.1.53 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తంలో ఆ సంస్థ కొంత మాత్రమే చెల్లించి మిగిలిన సొమ్ము ఇంత వరకూ జమ చేయలేదు. వైఎస్ఆర్ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆ బకాయిలపై దృష్టి పెట్టలేదు. దీంతో ఆ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం గత ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.88.73 కోట్లకు చేరుకుంది. ఈ బకాయిలు చెల్లించాలని జారీ చేసిన నోటీసులకు సంస్థ నుండి సమాధానం రాలేదు.
ఇప్పుడు విశాఖ పరిపాలనా రాజధానిగా డిక్లేర్ అవుతుండటంతో ఆ భూముల విలువ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ భూములు ఎకరం రూ. ఆరు కోట్లకు పైగా పలుకుతున్నాయి. ఈ లెక్కన పాత ధరల ప్రకారం ఆ సంస్థకు భూములను కేటాయించినట్లైయితే ప్రభుత్వానికి రూ.99 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అధికారులు గుర్తించారు. అంతే కాకుండా ఏంతో విలువైన భూములను చాలా తక్కువ ధరలకు కేటాయించడంపైనా పలు ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. ఈ భూముల కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటికే ఆ సంస్థ చెల్లించిన మొత్తాన్ని సాధారణ వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విఎంఆర్డీయేను ప్రభుత్వం ఆదేశించింది.